`సిసింద్రీ చిట్టిబాబు`కి 50 ఏళ్ళు!
on Jun 18, 2021
`నటభూషణ్` శోభన్ బాబు, `ఊర్వశి` శారదది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో `సిసింద్రీ చిట్టిబాబు` ఒకటి. `మనుషులు మారాలి` వంటి ఘనవిజయం తరువాత శోభన్, శారద జంటగా అలరించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో మాస్టర్ ప్రభాకర్ నటించగా.. గుమ్మడి, రాజబాబు, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య,
రాధాకుమారి, గోకినరామారావు, మాడా ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఓ ప్రత్యేక గీతంలో నగేశ్, జ్యోతిలక్ష్మీ చిందులేశారు. ఎ. సంజీవి (ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ నాన్న) దర్శకత్వం వహించిన ఈ
చిత్రానికి పినిశెట్టి (ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తండ్రి) కథను అందించారు.
టి. చలపతిరావు ఈ సినిమాకి సంగీతమందించగా.. దిగ్గజ గీతరచయితలు సి.నారాయణరెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. పాటల్లో.. ``వస్తా వెళ్ళొస్తా..``, ``బొమ్మలోయ్ బొమ్మలు``, ``ఓహో ఓహో జాంబియా``, ``ముల్లు గుచ్చుకుంది బావా`` ప్రజాదరణ పొందాయి. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1971 జూన్ 18న విడుదలై జననీరాజనాలు అందుకున్న `సిసింద్రీ చిట్టిబాబు`.. నేటితో 50 వసంతాలను పూర్తిచేసుకుంది.