`ఆచార్య`తో చరణ్ సమ్మర్ హ్యాట్రిక్ కొట్టేనా!?
on Jan 18, 2022
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వెండితెరపై వినోదాలు పంచి మూడేళ్ళు దాటింది. 2019 సంక్రాంతికి విడుదలైన `వినయ విధేయ రామ`తో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేశారీ కొణిదెల స్టార్. కాగా, ఈ ఏడాది `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య` చిత్రాలతో పలకరించబోతున్నారు చరణ్. వీటిలో `ఆచార్య` సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 1న థియేటర్స్ లోకి రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు వేసవిలో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాగా, అవి రెండు కూడా మంచి విజయం సాధించాయి. 2012లో మాస్ ఎంటర్టైనర్ `రచ్చ`తో ఫస్ట్ టైమ్ సమ్మర్ లో సందడి చేసిన చరణ్.. ఆపై 2018లో పిరియడ్ డ్రామా `రంగస్థలం`తో సెకండ్ టైమ్ మురిపించారు. ఈ రెండు సందర్భాల్లోనూ తనని సక్సెస్ వరించింది. మరీముఖ్యంగా.. `రంగస్థలం`తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ చూశారు చరణ్. మరి.. నాలుగేళ్ళ తరువాత ముచ్చటగా మూడోసారి ఈ సీజన్ లో అలరించబోతున్న మెగాపవర్ స్టార్.. తన ఖాతాలో సమ్మర్ హ్యాట్రిక్ ని జమ చేస్తారేమో చూడాలి.
Also Read: "ఊ అంటావా మావ" సాంగ్ కోసం సెక్సీగా సమంత ఎలా మారిందంటే..!
కాగా, `ఆచార్య`లో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో కనిపించనుండగా.. చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే దర్శనమివ్వనున్నారు. విజనరీ కెప్టెన్ కొరటాల శివ రూపొందించిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందించారు.