చిరు.. బాలయ్య.. ప్రభాస్... ముగ్గురిలో ఎవరొస్తారు?
on Nov 4, 2018
తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు కొత్త కాదు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. తరవాత మల్టీస్టారర్స్ తగ్గాయి. వెంకటేష్ ముందడుగు వేయడంతో కొన్నేళ్లుగా మల్టీస్టారర్స్ మొదలయ్యాయి. పవన్కల్యాణ్, మహేష్బాబు, కమల్హాసన్, రామ్తో మల్టీస్టారర్స్ చేశారు. ఇప్పుడు మేనల్లుడు నాగచైతన్య, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో సినిమాలు చేస్తున్నారు. అయితే... తెలుగులో వచ్చిన, వస్తున్న మల్టీస్టారర్స్లో అసలు సిసలైన మల్టీస్టారర్ అంటే.. 'ఆర్ఆర్ఆర్'. చిరంజీవి వారసుడు, మెగా పవర్స్టార్ రామ్చరణ్, నందమూరి ఫ్యామిలీ వారసుడు, యంగ్టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రమిది. అందుకని, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. 'బాహుబలి' తరవాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడమూ ప్రేక్షకుల్లో అమితాసక్తికి ఓ కారణమే.
ఈ నెల 11న, ఉదయం 11 గంటలకు ఈ సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరొస్తారు? అనే డిస్కషన్ ఫిలింనగర్ వాసుల్లో జోరుగా జరుగుతోంది. రామ్చరణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ తరపున నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రారంభోత్సవానికి అతిథులుగా వస్తారని ఫిలింనగర్ టాక్. మరోపక్క ప్రభాస్ కూడా వస్తారని అంటున్నారు. బాహుబలి తరవాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి... 'బాహుబలి'లో నటించిన ప్రభాస్ పేరు వినబడుతుంది. చిరు.. బాలయ్య.. ప్రభాస్.. ముగ్గురిలో ఎవరొస్తారో? ఎవరు రారో? వెయిట్ అండ్ సీ!