'పుష్ప' ట్రైలర్ టీజ్.. అంచనాలకు మించి ఉంది!
on Dec 3, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప పార్ట్ 1 ట్రైలర్ ను డిసెంబర్ 6 న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా 'పుష్ప ట్రైలర్ టీజ్' రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్.
'పుష్ప ట్రైలర్ టీజ్' పేరుతో 26 సెకన్ల నిడివి ఉన్న వీడియోని మేకర్స్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. టీజర్ తో ఇప్పటికే పుష్పపై మంచి అంచనాలు ఏర్పడగా.. ఇప్పుడు ఈ ట్రైలర్ టీజ్ వీడియో ఆ అంచనాలను రెట్టింపు చేసింది. బన్నీతో పాటు ఇతర కీలక పాత్రధారులను వీడియోలో చూపించారు. విజువల్ గా చాలా బాగుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీడియో చివరిలో బన్నీ చేతిలో గొడ్డలి పట్టుకొని దుంగలపై నుంచి దూకే షాట్ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ట్రైలర్ టీజ్ వీడియోనే ఇలా ఉంటే ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ప్రేక్షకుల్లో ట్రైలర్ పై ఆసక్తి పెరిగింది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న పుష్పలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read