సిబిఐ సినిమాలతో మమ్ముట్టి రికార్డ్...
on Jul 2, 2020
హాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువ. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్... ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమా ట్రెండ్ ఇటీవల కాలంలో పెరుగుతోంది. హిందీలో 'గోల్ మాల్' ఫ్రాంచైజీలో ఐదు సినిమాలొచ్చాయి. 'దబాంగ్'లో మూడు సినిమాలు వచ్చాయి. సౌతిండియాలో సూర్య 'సింగం' సిరీస్లో మూడు సినిమాలు చేశాడు. అయితే, ఇవన్నీ 2000 తరవాత స్టార్ట్ అయినవే. 1988లో చేసిన ఓ సినిమాకు ఇప్పటివరకు నాలుగు సీక్వెల్స్ రావడం, ఐదో సీక్వెల్ తీయడానికి రెడీ కావడం రికార్డు కదా!
మలయాళ స్టార్ మమ్ముట్టి 1988లో 'ఓరు సిబిఐ డైరీ కురిప్పు' అని సినిమా చేశారు. ఆయన కెరీర్లో అదొక టర్నింగ్ పాయింట్ సినిమాగా నిలిచింది. మరుసటి ఏడాది 'జాగ్రత్త' అని సీక్వెల్ చేశారు. అదీ హిట్. తరవాత 2004లో 'సేతురామ అయ్యర్ సిబిఐ', 2005లో 'నేరారియన్ సిబిఐ' చేశారు. మళ్లీ 15 ఏళ్ల తరవాత సిబిఐ సినిమా ఫ్రాంచైజీలో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కేరళలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి చిత్రీకరణలు మొదలైన తరవాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట. సౌతిండియాలో ఐదు సీక్వెల్స్ ఇప్పటివరకు రాలేదని, అన్ని సినిమాలు చేసిన రికార్డ్ మమ్ముట్టిదేనని మలయాళ ఇండస్ట్రీ అంటోంది.