ENGLISH | TELUGU  

'నాలో నేనే లేను' అంటున్న కిరణ్ అబ్బవరం!

on May 15, 2023

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'రూల్స్ రంజన్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది.

'నాలో నేనే లేను' లిరికల్ వీడియోని సోమవారం ఉదయం విడుదల చేసింది చిత్ర బృందం. తన ప్రేమను కథానాయకకి చెప్పడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చూపించారు. కళ్లద్దాలు, నుదుటున బొట్టుతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న కథానాయకుడు.. నాయికని ఫాలో అవుతూ ఆమె గురించి పాడుకోవడం ఆకట్టుకుంది. లిరికల్ వీడియోలో నాయికలా నాట్యం చేయబోయి కథానాయకుడు కిందపడటం, ఆమె నడిచొస్తుంటే అతను పూలు చల్లడం వంటి సరదా సన్నివేశాలు అలరించాయి. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం వినసొంపుగా, ఆహ్లాదకరంగా ఉంది. సంగీతానికి తగ్గట్టుగానే రాంబాబు గోసాల అందించిన సాహిత్యం ఎంతో హాయిగా, స్వచ్ఛంగా ఉంది. అందరికీ అర్ధమయ్యే భాషలో ఎంతో అర్థవంతంగా పాటను రాశారు. ఇక శరత్ సంతోష్ ఎంతో అందంగా పాటను ఆలపించి కట్టిపడేశారు.

'నాలో నేనే లేను' పాట విడుదల సందర్భంగా గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. " రూల్స్ రంజన్ చిత్రంలో నాలో నేనే లేను అనే పాట రాయడం చాలా సంతోషం కలిగించింది. మా దర్శకులు రత్నం కృష్ణ గారు చాలా మంచి సందర్భాన్ని నాకు వివరించారు. చాలా అందమైన చిన్న చిన్న పదాలతో తన ప్రేమని కథానాయిక కి తెలియజేయడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చెప్పాము. అందమైన బాణీకి తేలిగ్గా పాడుకునేటట్లుగా ఉండే మంచి పదాలతో పాటని రాయమని చెప్పారు. నాతో ఇంత మంచి పాట రాయించినందుకు మా దర్శకులకి కృతజ్ఞతలు, అలాగే హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం గారు నేహా శెట్టి ఈ పాటలో చాలా అందంగా కనిపించారు. సంగీత దర్శకులు అమ్రిష్ గారు చాలా మంచి బాణీ అందించారు. అలాగే గాయకులు శరత్ సంతోష్ చాలా బాగా పాడారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.

వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. కథానాయకుడు కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు, ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటం తో పాటు, పూర్తి స్థాయి వినోద భరిత కథాచిత్రమిది. సగటు సినిమా ప్రేక్షకుడు మనసారా వినోదాన్ని ఆస్వాదించే చిత్రమవుతుంది. ఇందుకు చిత్ర కథ, నాయకానాయికల పాత్రలు, కథానుగుణంగా సాగే ఇతర ప్రధాన తారాగణం పాత్రలు, సంభాషణలు, సంగీతం ఇలా అన్నీ సమపాళ్లలో చక్కగా కుదిరిన ఓ మంచి చిత్రం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, దర్శకుడు  రత్నం కృష్ణ. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో చిత్రాన్ని విడుదల చేయాలన్నది సంకల్పం అని తెలిపారు. 

మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఎం. సుధీర్, సినిమాటోగ్రాఫర్ గా దులీప్ కుమార్, ఎడిటర్ గా వరప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.