మంచు విష్ణు 'చదరంగం' వెబ్ సిరీస్ కు ప్రతిష్టాత్మక అవార్డు
on May 15, 2021
నటుడు, నిర్మాత మంచు విష్ణు నిర్మించిన తెలుగు వెబ్ సిరీస్ ‘చదరంగం’ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించిన తొలి వెబ్ సిరీస్ ఇది. రాజ్ అనంత దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో శ్రీకాంత్, సునైనా, నాగినేడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2020లో ZEE5 లో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఇది ఉత్తమ వెబ్ సిరీస్-ప్రాంతీయ అవార్డును గెలుచుకుంది. ఆన్ డిమాండ్ వీడియో, ఆడియో కంటెంట్లకు సంబంధించి ఎక్స్ఛేంజ్ ఫర్ మీడియా(ఇ4ఎమ్) గ్రూప్ ప్రకటించిన స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్లో ‘చదరంగం’ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్ గా అవార్డు గెలుచుకుంది.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు లభించడం చాలా గౌరవంగా ఉంది. ‘చదరంగం’ మా టీమ్ అందరి మనసులకు బాగా దగ్గరైన వెబ్ సిరీస్. రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను చేసేందుకు ఇలాంటి అవార్డ్స్ ఉత్సాహాన్ని ఇస్తాయి. అన్ని ప్లాట్ఫామ్లలో భారతదేశంలోనే ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్గా ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఎంపిక కావడం మాకు గర్వకారణం’’ అంటూ మంచు విష్ణు తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.