ఆస్కార్ ఓటింగ్ లో విన్ అవుతామంటున్న 'మనసానమః' టీమ్!
on Dec 6, 2021
విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన షార్ట్ ఫిల్మ్ 'మనసానమః'. ఇందులో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించాడు. గతేడాది యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిల్మ్.. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది. ఆస్కార్ క్వాలిఫైలో ఉన్న 'మనసానమః'కు ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో 'మనసానమః' టీమ్ పాల్గొని చిత్ర విశేషాలను, ఆస్కార్ పోటీలో ఎంపికపై వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రేమ కథనే కొత్తగా ఎలా తెరకెక్కించాలని ఆలోచించినప్పుడు కంప్లీట్ రివర్స్ స్క్రీన్ ప్లేతో మ్యూజికల్ గా చేద్దామని అనుకున్నాం. కథను మొత్తం రివర్స్ లో తీయడం షూటింగ్ టైమ్ లో పెద్ద ఛాలెంజ్. ప్రొడక్షన్ టైమ్ లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. మంచి టీమ్ తో అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించాం. 'మనసానమః'కు ఇంటర్నేషనల్ గా వందల అవార్డులు రావడం మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్ లోనూ విన్ అవుతామని ఆశిస్తున్నాం. నా అభిమాన దర్శకుడు సుకుమార్. త్వరలోనే ఫీచర్ ఫిల్మ్ చేయబోతున్నాను." అన్నారు.
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. "దీపక్ మనసానమః కథ చెప్పినప్పుడు చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకురాగలడా అనిపించింది. కానీ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయ్యాక అతని వర్క్ ఏంటో తెలిసింది. గతేడాది లాక్ డౌన్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేశాం. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్ కు 900 పైగా అవార్డ్స్ రావడం గర్వంగా ఉంది. ఆస్కార్ క్వాలిఫై ఓటింగ్ పై పాజిటివ్ గా ఉన్నాం." అన్నారు.
హీరోయిన్ దృషిక మాట్లాడుతూ.. "మనసానమః సినిమాకు ఇంత రెస్పాన్స్, ఇన్ని అవార్డ్స్ రావడం నమ్మలేకపోతున్నాను. నా మొదటి సినిమాకే ఇంతలా అప్రిషియేషన్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలుగు రాదు. యాక్టింగ్ కోర్సులు చేయలేదు. కానీ కథను బిలీవ్ చేసి నటించాను. ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించడం నాకు నిజంగా ఛాలెంజింగ్ గా అనిపించింది." అన్నారు.