ఆ జోన్ నుంచి బయటకొచ్చిన మహేష్..!
on Jan 9, 2020
ప్రయోగాలు మాట్లాడుకోవడానికి మాత్రమే బావుంటాయని అగ్ర కథానాయకుడు మహేష్ బాబు అన్నారు. స్టార్ హీరోలు ప్రయోగాత్మక చిత్రాలు ఎందుకు చేయరు? భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే చేస్తారా? అనే ప్రశ్నలు ఎప్పటినుండో ఉన్నాయి. కంఫర్ట్ జోన్ లో మాత్రమే సినిమాలు చేస్తున్నారనే విమర్శ కూడా ఉంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈ నెల 11న విడుదల కానున్న సందర్భంలో మీడియాతో మహేష్ ముచ్చటించారు. పలు అంశాలపై తన మనసులో మాటలను చెప్పారు.
"ప్రయోగాలు మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటాయి. చేయడానికి బాగోవు. ఒక స్టార్ హీరో ప్రయోగాత్మక చిత్రం చేయడానికి బోలెడు లెక్కలు వేసుకోవాలి. హీరో ఇమేజ్ మీద మార్కెట్ జరుగుతున్నప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం కష్టమవుతుంది" అని మహేష్ అన్నారు.
'సరిలేరు నీకెవ్వరు' సినిమా 'దూకుడు' స్టైల్ లో ఉంటుందని ఆయన అన్నారు. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఈ సినిమా చేశానని ఆయన తెలిపారు. "శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి... లాస్ట్ చేసిన నాలుగైదు సినిమాల్లో సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. ఈ సినిమాకు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాను. దూకుడు స్టైల్ లో ఉంటుందీ సినిమా" అని మహేష్ అన్నారు.