ENGLISH | TELUGU  

బాలయ్య vs చిరు.. సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా ఇలాగే మాట్లాడతా!

on Sep 25, 2025

 

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ సమయంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అప్పుడు సీఎం జగన్ కలుస్తారంటూ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులను పిలిపించారు. తీరా వాళ్ళు వచ్చాక.. సీఎం కలవరు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని కలిసి వెళ్లిపోండి అన్నారు. దాంతో చిరంజీవి కాస్త గట్టిగా అడగటంతో, సీఎం కలిశాడు." అని అన్నారు. (Nandamuri Balakrishna)

 

కామినేని శ్రీనివాస్ మాటలకు బదులిస్తూ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట." అంటూ బాలకృష్ణ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బాలయ్య కామెంట్స్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో దీనిపై చిరంజీవి స్పందించారు. (Chiranjeevi)

 

"అసెంబ్లీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక  నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు.. కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి.. సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని  కోరారు. నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్ లో మాట్లాడాను. ఆ తర్వాత ఓ రోజు మంత్రిగారు నాకు ఫోన్ చేసి “ముఖ్యమంత్రి గారు ముందు మీతో ఒన్ టు ఒన్ కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ” డేట్ ఇచ్చారు. 

ముఖ్యమంత్రి గారితో లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత పేర్నినాని గారు నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను.  ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తి గారితో సహా మరి కొంతమందిని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసాము. 

ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు  ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను." అని చిరంజీవి ప్రకటనలో పేర్కొన్నారు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.