ఖిలాడితో అర్జున్?
on Dec 2, 2020
మాస్ మహారాజా రవితేజ 2021 వేసవిలో ఖిలాడిగా పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రాక్షసుడు వంటి విజయవంతమైన చిత్రం తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజకి జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సీనియర్ హీరో అర్జున్ నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా సాగాయని.. కథ - పాత్ర నచ్చడంతో అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. త్వరలోనే ఖిలాడిలో అర్జున్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ఇంకా విడుదల కాని తమిళ చిత్రం శతురంగ వేట్టై (అరవింద్ స్వామి, త్రిష) ఆధారంగా ఖిలాడి రూపొందుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.