వెంకీ 'వారసుడొచ్చాడు'కి 33 ఏళ్ళు!
on Oct 13, 2021
విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `వారసుడొచ్చాడు` ఒకటి. కోలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ మణివణ్ణన్ రూపొందించిన తమిళ సినిమా `తీర్థ కరైయినిలే` (మోహన్, రూపిణి) ఆధారంగా తెరకెక్కిన ఈ విలేజ్ ఫ్యామిలీ డ్రామాకి ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకీకి జంటగా సుహాసిని నటించగా నిర్మలమ్మ, మోహన్ బాబు, గొల్లపూడి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మల్లికార్జునరావు, వసంత్, రమాప్రభ, శ్రీలక్ష్మి, శ్రీ దుర్గ (మాలాశ్రీ), సంధ్య, డబ్బింగ్ జానకి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
కథ విషయానికొస్తే.. నిరుద్యోగి అయిన బోస్ (వెంకటేశ్) ఓ యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రిలో జాయినవుతాడు. అక్కడే మరికొద్దిరోజుల్లో చనిపోబోతున్న టీబీ పేషంట్ రఘు (వసంత్)తో అతనికి పరిచయమవుతుంది. ఇద్దరు కూడా మంచి స్నేహితులవుతారు. అనూహ్య ఘటనతో చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయివచ్చానంటూ ఓ సందర్భంలో తన గతాన్ని చెప్పుకొచ్చిన రఘుని.. మళ్ళీ ఊరెళ్ళమంటాడు బోస్. అయితే, చివరిరోజులు గడుపుతున్న రఘు తనకు బదులుగా బోస్ ని వెళ్ళాల్సిందిగా కోరతాడు. ఈ క్రమంలో.. భూస్వామి అయిన శేషమ్మ (నిర్మలమ్మ) వారసుడిగా సదరు ఊరికి వెళ్ళిన బోస్ కి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నిజం తెలిశాక ఏం జరిగింది? అనేదే మిగిలిన సినిమా. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథనంతో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అప్పట్లో విశేషాదరణ పొందింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన `అతడు` (2005) కూడా ఇంచుమించుగా ఇదే స్టోరీలైన్ తో తెరకెక్కింది.
ఇక పాటల విషయానికి వస్తే.. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన ``నీ అందం`` (వేటూరి రచన - బాలు, చిత్ర గానం) అంటూ సాగే ప్రణయగీతం ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన `వారసుడొచ్చాడు`.. 1988 అక్టోబర్ 13న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 33 వసంతాలు పూర్తిచేసుకుంది.