![]() |
![]() |

సినిమా ఇండస్ట్రీలో హీరోల కెరీర్ చాలా లాంగ్ రన్ తో కొనసాగుతుంది. అదే హీరోయిన్ల విషయానికి వస్తే వారు మహా అయితే 10 నుంచి 15 ఏళ్లు కెరీర్ కొనసాగిస్తారు. ఆ తర్వాత పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోతారు. దీనికి ఏ ఒకరిద్దరు మాత్రమే మినహాయింపు. చాలామంది అలా మెరిసి ఇలా మాయమయ్యే వారే. కానీ స్టార్ హీరోలు మాత్రం ఏడు పదుల వయసు వచ్చినప్పటికీ తమ మనవరాళ్ల వయసు ఉన్న హీరోయిన్లతో ఆడిపాడుతూ ఉంటారు. ఎన్టీఆర్ నటించిన 'బడిపంతులు' చిత్రంలో శ్రీదేవి ఆయన మనవరాలి పాత్రలో బాలనటిగా కనిపించింది. ఆమె ఆ తర్వాత కాలంలో 'వేటగాడు' చిత్రంతో ఎన్టీఆర్ కి జోడిగా మారింది. ఆపై ఆయనతో కలిసి పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది. వారిది హిట్ పెయిర్.
ఇలా తీసుకుంటే చాలామంది ఉంటారు. కానీ ఈ మధ్య కొంచెం ట్రెండ్ మారింది. కొంతమంది హీరోయిన్లు రెండు తరాలకు చెందిన తండ్రి కొడుకులు అయిన హీరోల సరసన నటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వారి విషయానికి వస్తే తాజాగా మూడు పదుల వయసున్న శ్రుతి హాసన్ ఆరు పదుల వయసున్న మెగాస్టార్ చిరంజీవి సరసన 'వాల్తేరు వీరయ్య'లో నటించింది. ఈమె ఇంతకుముందు మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'ఎవడు' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే ఆమె రామ్ చరణ్ సరసన 'మగధీర', 'నాయక్', 'గోవిందుడు అందరివాడేలే' సినిమాల్లో జోడీగా నటించింది. ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ మూవీ అయిన 'ఖైదీ నెంబర్ 150'లో ఆయనతో జోడి కట్టింది. తమన్నా విషయానికి వస్తే రామ్ చరణ్ సరసన 'రచ్చ' సినిమాలో జోడి కట్టింది. ఆ తర్వాత ఈమె 'సైరా నరసింహారెడ్డి' మూవీలో ఆయన తండ్రి మెగాస్టార్ తో కలిసి నటించింది. త్వరలో చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో 'వేదాళం'కు రీమేక్ గా రూపొందుతున్న 'బోళా శంకర్' చిత్రంలో కూడా చిరు సరసన ఆమె నటిస్తోన్న సంగతి తెలిసిందే.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య సరసన 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే సినిమాలో నటించింది. తర్వాత కాలంలో 'మన్మథుడు 2'లో చైతూ తండ్రి నాగార్జునతో జతకట్టింది. నాగచైతన్య నటించిన 'యుద్ధం శరణం'లో లావణ్య త్రిపాఠి నాయికగా చేసింది. తర్వాత నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో ఆయన సరసన ఆడిపాడింది.
ఎన్టీఆర్, బాలకృష్ణ విషయానికి వస్తే ఎన్టీఆర్తో బాలీవుడ్ హీరోయిన్ రతి అగ్నిహోత్రి 'కలియుగ రాముడు', 'ప్రేమ సింహాసనం' వంటి సినిమాలలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ, ఎన్టీఆర్తో కలిసి నటించిన 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర'లో బాలయ్యకు జోడి కట్టింది.
ఇక సహజ నటి జయసుధ ఎన్టీఆర్తో ఎన్నో చిత్రాలలో కలిసి నటించింది. చాలా కాలం తర్వాత ఈమె బాలయ్య సరసన అధినాయకుడు చిత్రంలో నటించింది. నాటి అందాల తార రాధ కూడా ఎన్టీఆర్ సరసన చండశాసనుడు చిత్రంలో నటించింది. ఈమె ఆ తరువాత బాలకృష్ణ నటించిన పలు చిత్రాలలో ఆయనకు జంటగా చేసింది.
ఏఎన్ఆర్, నాగార్జున విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆదర్శవంతుడు, వసంతగీతం, గోపాలకృష్ణుడు వంటి సినిమాల్లో రాధ హీరోయిన్గా నటించింది. ఆ తరువాత అక్కినేని కుమారుడైన నాగార్జునతో 'విక్కీ దాదా'లో కలిసి నటించి మెప్పించింది. రాధ తెలుగులోనే కాదు తమిళంలో కూడా శివాజీ గణేషన్, ఆయన కుమారుడు ప్రభుతో కలిసి నటించిన ఘనతను సాధించింది. శివాజీ గణేషన్ తో కలిసి 'ఆత్మబంధువు' చిత్రంలో నటించిన ఈమె, ప్రభుతో కొన్ని చిత్రాలలో జోడి కట్టింది.
అతిలోక సుందరి శ్రీదేవి విషయానికి వస్తే ఈమె ఏఎన్ఆర్ నటించిన ప్రేమాభిషేకం, శ్రీరంగనీతులు, ముద్దుల కొడుకు వంటి చాలా సినిమాలలో నటించి మెప్పించింది. ఈమె నాగార్జున సరసన ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా, ఖుదా గవా, మిస్టర్ బేచారా సినిమాలలో కలిసి నటించింది. బాలీవుడ్ లో కూడా ఈమె తండ్రి కొడుకులు అయినా ధర్మేంద్ర, సన్నిడియోల్ లతో కలిసి నటించిన ఘనత దక్కుతుంది. ఇక అమితాబ్తో కలిసి 'లాల్ బాద్షా' సినిమాలో నటించిన శిల్పా శెట్టి, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ నటించిన 'ఫిర్ మిలేంగే' చిత్రంలో నటించింది.
ఐశ్వర్యారాయ్ 'బంటి ఔర్ బబ్లీ' చిత్రంలో తండ్రి తనయులైన అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్తో కలిసి 'కజరారే' పాటలో ఆడి పాడింది. కానీ ఈమె తన మామ అమితాబచ్చన్ తో కలిసి ఆయన సరసన మాత్రం నటించలేదు. కృష్ణ, రమేష్ బాబుల విషయానికి వస్తే కృష్ణతో 'గూఢచారి 117' చిత్రంలో నటించిన భానుప్రియ, ఆయన కుమారుడైన రమేష్ బాబుతో 'బ్లాక్ టైగర్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. గౌతమి కూడా కృష్ణ సరసన 'అన్న తమ్ముడు', 'డియర్ బ్రదర్' సినిమాలలో చేసింది. అంతకుముందే ఈమె రమేష్ బాబు సరసన 'కృష్ణగారి అబ్బాయి'లో కనిపించింది. రంభ కూడా సూపర్ స్టార్ కృష్ణతో 'రౌడీ అన్నయ్య' సినిమా చేసింది. అంతకుముందు 'ఎస్ నేనంటే నేనే' సినిమాలో కృష్ణకు జోడి గానే నటించింది. ఆ తర్వాత ఆమె రమేష్ బాబు నటించిన 'పచ్చతోరణం'లో హీరోయిన్ గా నటించింది. ఆమని కూడా కృష్ణ నటించిన 'పచ్చని సంసారం' సినిమాలో హీరోయిన్ గా మెప్పించింది. ఆ తర్వాత రమేష్ బాబు నటించిన 'అన్నా చెల్లెలు' సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది.
వాణి విశ్వనాథ్.. రమేష్ బాబు సరసన 'ఆయుధం', 'మామ కోడలు' సినిమాలలో యాక్ట్ చేసింది. 'రైతు భారతం'లో కృష్ణతో నటించింది. 'ఎన్కౌంటర్' చిత్రంలో రమేష్ బాబు సరసన నటించిన రుచిత ప్రసాద్ ఆ తర్వాత కొంత కాలానికి సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'వారెవ్వా మొగుడు' సినిమాలో ఆయనకు జోడీగా నటించింది. మొత్తానికి పలువురు హీరోయిన్లు రెండు తరాల హీరోలైన తండ్రి కొడుకుల సరసన నటించిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
![]() |
![]() |