![]() |
![]() |

దిల్ రాజు పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. ఆయన తన పెత్తనం చూపించాలని బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలకు పోటీగా కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ నటించిన వారసుడును విడుదల చేయాలని భావించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ థియేటర్లన్నీ తన సినిమాకి కేటాయించుకోవాలని వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లకు మించి థియేటర్లలో తన చిత్రాన్ని విడుదల చేయాలని భావించాడు. ఇదే ఆయనకు అసలు దీనపరిస్థితికి అసలు కారణమైంది.
ఇలా థియేటర్ల విషయంలో మరీ పట్టుదలకు పోకుండా ఉండి ఉంటే వారసుడు చిత్రం తమిళ్ వారీసుతోపాటు తెలుగులో వారసుడిగా జనవరి 11న విడుదలై ఉండేది. అలా విడుదలై వుంటే సినిమాకి కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చి ఉండేవి. కానీ దిల్ రాజు థియేటర్ల విషయంలో పట్టుదలకు పోవడంతో చిరు బాలయ్యల అభిమానుల దాటికి, సినీ పెద్దలు మాటకు తలవంచక తప్పలేదు.
తమిళ్లో 11న విడుదలైన వారిసు చిత్రాన్ని మూడు రోజుల గ్యాప్ తర్వాత 14వ తేదీన థియేటర్లోకి తీసుకొని వచ్చాడు. అప్పటికే తమిళ్లో ఈ చిత్రానికి వచ్చిన యావరేజ్ టాక్ తెలుగు నాట బాగా ప్రచారం జరిగింది. సినిమాకు సంబంధించిన కథ, కథనం ఇతర విషయాలు కూడా బయటకు రావడంతో సినిమా కథ ఏంటో తెలిసిపోయింది. ఇంటర్నెట్లో పైరసీ కూడా ప్రత్యక్షమైంది. దాంతో ప్రేక్షకులు వారసుడికి పోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేకపోతున్నారు. దాంతో యావరేజ్ టాక్ సంపాదించుకున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు ఇప్పుడు సూపర్ హిట్ దిశగా సాగుతున్నాయి.
మరోవైపు 100 కోట్లు పారితోషికం ఇచ్చి విజయ్ ని ఈ చిత్రం కోసం ఒప్పించాడు. ఈ సినిమాకు 250కోట్లు ఖర్చు పెట్టాడు. మరి 100 కోట్ల పారితోషికం తీసుకున్న విజయ్ కోలీవుడ్ పై చూపించిన ఆసక్తి టాలీవుడ్ విషయంలో చూపించలేదు. కనీసం సినిమా ప్రమోషన్స్కు కూడా రాలేదు. హీరో హీరోయిన్లు లేకుండా సినిమాని ప్రమోట్ చేయడం ఏ విధంగా ఉంటుందో దిల్ రాజుకి బాగా అర్ధమయ్యే ఉంటుంది. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టులతో ప్రమోషన్స్ చేశాడు. ఒక విధంగా బాలీవుడ్ స్టార్లే కిందకి దిగి వచ్చి ఓ మెట్టు దిగి తెలుగు, తమిళ భాషల్లో తమ చిత్రాలను ప్రమోట్ చేస్తూ ఉంటే విజయ్ తన మార్కెట్ విస్తరించుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలుగు పై అయినా సీత కన్ను వేశాడు.
తెలుగు మార్కెట్ పై ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. మొత్తానికి ఈ చిత్రానికి అదొక పెద్ద డ్రా బ్యాక్ గా చెప్పుకోవాలి. కోట్లు పెట్టి తీసే సినిమా ద్విభాషా చిత్రంగా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల అయి ఉంటే కాస్తయినా కలెక్షన్లు ఉండేవి. కానీ ఇంత స్టార్ ప్రొడ్యూసర్ అయి ఉండి.... అందులో పక్క జడ్జిమెంట్ ఇవ్వగలడని పేరు ఉన్న దిల్ రాజు ఈ చిత్రం విషయంలో పప్పులో కాలేశాడు. వంశీ పైడిపల్లి చెప్పిన ఓ పాత చింతకాయ పచ్చడి ఇలాంటి కథను తీసుకొని మెరుగులు దిద్దాలని చూసాడు. ఇదే స్టోరీ తో గతంలో ఎన్నో తెలుగు చిత్రాలు వచ్చాయి.
కానీ వంశీపైడిపల్లి, దిల్ రాజులు తమకు ఏది నచ్చితే అదే కొత్తదనం అని ఫీల్ అయ్యారు. తమకు వచ్చిన ఐడియా నే కొత్తదనం అని భావిస్తే ఇంకా చేయడానికి ఏమీ ఉండదు. బడాబడా స్టార్లు నిర్మాతలు కూడా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు కొత్త కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మన దిల్ రాజు గారు మాత్రం రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో ఇదే కథతో వస్తున్న కథను ఎంచుకొని బోల్తాపడ్డాడు. అందుకే పెద్దవాళ్ళు అన్నట్టు చెడపకురా చెడేవు అనేది దిల్ రాజుకి సరిగ్గా సరిపోయే సామెతగా పలువురు సెటైర్లు వేస్తున్నారు.
![]() |
![]() |