ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం లేదు.. పవన్ కూడా నన్ను పిలవలేదు!
on May 10, 2024
మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు చేసిన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అదే సంవత్సరం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ వంటి పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేసింది. ఢల్లీిలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు చిరంజీవి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగానే నాకు ఈ అవార్డు లభించింది. పద్మవిభూషణ్ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రయాణంలో నా అభిమానుల అండదండలు ఎప్పటికీ మరచిపోలేను. ఈ సందర్భంగా అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని అంటూ ‘ప్రస్తుతం ఉన్న ఎన్నికల వాతావరణం గురించి మాట్లాడాలంటే నేను పార్టీలోనూ లేను. పిఠాపురంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. పవన్కి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఎన్నికల ప్రచారానికి నేను వెళ్ళడం లేదు. పవన్ నాకు ఆ వెసులుబాటు ఇచ్చాడు. అలాగే ఎన్నికల ప్రచారానికి రమ్మని పవన్ కూడా నన్ను ఎప్పుడూ అడగలేదు’ అన్నారు. ఈ సందర్భంలోనే భారతరత్న అవార్డు గురించి ప్రస్తావించారు చిరంజీవి. ఎన్.టి.రామారావుగారికి భారతరత్న అవార్డు వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో ఆ అవార్డు త్వరగా రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు చిరంజీవి.
Also Read