బన్నీతో ప్రభాస్ దర్శకుడి పాన్ - ఇండియా మూవీ?
on Nov 29, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. రెండు భాగాలుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్`.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న థియేటర్స్ లో సందడి చేయనుంది. సెకండ్ పార్ట్ వచ్చే సంవత్సరం తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో పాన్ - ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట బన్నీ. ఆ వివరాల్లోకి వెళితే.. మ్యాచో స్టార్ గోపీచంద్ `జిల్` చిత్రంతో దర్శకుడిగా పరిచయమై.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో `రాధే శ్యామ్` తీసిన రాధాకృష్ణ.. ఇటీవల అల్లు అర్జున్ ని సంప్రదించి ఓ ఆసక్తికరమైన స్టోరీ లైన్ చెప్పారని బజ్. అది నచ్చడంతో బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. పాన్ - ఇండియా లెవల్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `రాధే శ్యామ్` సంక్రాంతి కానుకగా జనవరి 14న పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇందులో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే దర్శనమివ్వనుంది. కృష్ణంరాజు, జయరామ్, భాగ్యశ్రీ, జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.