టాలీవుడ్ లో మరో భారీ మల్టీస్టారర్.. ఆ రీమేక్ లో చిరు, నాగ్!!
on Sep 24, 2021
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ఆర్ఆర్ఆర్', పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి కాంబినేషన్ లో 'భీమ్లా నాయక్' తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ లో తెరకెక్కుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ సెన్సేషనల్ కాంబినేషన్ లో సినిమా రానుందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి- నాగార్జున కాంబినేషన్ లో మల్టీస్టారర్ రానుందని టాక్ వినిపిస్తోంది.
తమిళ సూపర్ హిట్ మూవీ 'విక్రమ్ వేద'ను తెలుగు లో రీమేక్ చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా అక్కడ కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే 'విక్రమ్ వేద' హిందీలో రీమేక్ అవుతుండగా.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో నాగార్జునతో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇటీవల చిరంజీవి రీమేక్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మలయాళ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ 'గాడ్ ఫాదర్', తమిళ్ హిట్ మూవీ 'వేదాళం' రీమేక్ 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు 'విక్రమ్ వేద' రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
'విక్రమ్ వేద' తెలుగు రీమేక్ లో విజయ్ సేతుపతి పాత్రలో చిరంజీవి, మాధవన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది.