ఒకే వేదికపై నందమూరి హీరోలు!
on Jul 4, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ్ దర్శకుడు. ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ప్రమోషన్స్ కోసం నందమూరి హీరోలు రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
'బింబిసార' విడుదలకు ఇంకా నెలరోజులే ఉండటంతో ఈరోజు ట్రైలర్ విడుదలతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతోంది మూవీ టీమ్. అంతేకాదు విడుదలకు ముందు భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారని న్యూస్ వినిపిస్తోంది. బాబాయ్-అబ్బాయిలు లాస్ట్ టైమ్ 'అరవింద సమేత', 'ఎన్టీఆర్ బయోపిక్', '118' వేడుకల్లో ఒకే వేదికపై సందడి చేశారు. ఇప్పుడు 'బింబిసార' కోసం ముగ్గురు నందమూరి హీరోలు ఒకే వేదికపై కనిపించనున్నారని న్యూస్ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం విశేషం. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు.