ENGLISH | TELUGU  

శత వసంతాలు పూర్తి చేసుకున్న ‘మనదేశం’ నిర్మాత సి.కృష్ణవేణి!

on Dec 24, 2024

ఆమె పేరు సి.కృష్ణవేణి.. ఒక మహోన్నత వ్యక్తి. తెలుగుజాతికి ఒక మహానటుడిని, ఒక గానగంధర్వుడ్ని పరిచయం చేసిన ఘనత ఆమె సొంతం. బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేసి నటిగా, గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత మీర్జాపురం రాజాను వివాహం చేసుకొని నిర్మాతగా కూడా మారారు. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘మనదేశం’ ఈ చిత్రం ద్వారా మహానటుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావును పరిచయం చేశారు. అలాగే మధురగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చి తెలుగు సినిమా పురోగతికి తనవంతు కృషి చేశారు. కృష్ణవేణి సినీ ప్రస్థానం, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితం గురించిన విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. 

1924 డిసెంబర్‌ 24న రాజమహేంద్రవరంలో వైద్యుల ఇంట జన్మించారు కృష్ణవేణి. నాలుగేళ్ళ వయసులోనే ‘రామదాసు’ అనే నాటకంలో కమల పాత్ర ధరించి అందర్నీ మెప్పించారు. అది చూసిన దర్శకుడు సి.పుల్లయ్య ‘సతీ అనసూయ’ చిత్రంలో బాలనటిగా అవకాశం ఇచ్చారు. అలా సినీరంగంలోకి ప్రవేశించారు కృష్ణవేణి. ఆ తర్వాత 13 ఏళ్ళ వయసులో కథానాయికగా నటించారు. మీర్జాపురం రాజా నిర్మించిన ‘భోజ కాళిదాసు’ చిత్రంలో రెండవ కథానాయికగా అవకాశం లభించింది. ఆ సమయంలో రాజావారితో పరిచయం పెళ్ళి వరకు వెళ్లింది. కృష్ణవేణికి రంగస్థలంలో ఉన్న అనుభవం, పుస్తక పఠనం, సంగీతంపై పట్టు రాజావారి సినీ వ్యాపారానికి బాగా ఉపయోగపడిరది. తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో 15కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు కృష్ణవేణి. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడి గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 

బెంగాలీ నవల విప్రదాస్‌.. కృష్ణవేణికి బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని భర్తతో చెప్పారు. ఆ సమయంలో మీర్జాపురం రాజా ‘జస్టిస్‌’ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ బ్రిటీష్‌ వారికి అనుకూలంగా వుండేది. కృష్ణవేణి చెప్పిన కథ దేశభక్తితో కూడుకున్నది కావడం, బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఉండడంతో ఆయన సినిమాగా నిర్మించేందుకు ఒప్పుకోలేదు. అయితే కృష్ణవేణి మాత్రం పట్టుదలగా ఆ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అందుకే కుమార్తె అనురాధ పేరుతో ఎం.ఆర్‌.ఎ. ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి ‘మనదేశం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యతను ఎల్‌.వి.ప్రసాద్‌కు అప్పగించారు. ఈ సినిమాలోని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర కోసం ఎన్‌.టి.రామారావును ఎంపిక చేశారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలకు తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్‌.టి.రామారావు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఎంతటి ఘనకీర్తిని సాధించారో అందరికీ తెలిసిందే. ఒక మహానటుడ్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణవేణి పేరు దేశమంతా మారుమోగిపోయింది. 

ఎన్టీఆర్‌, ఘంటసాలనే కాకుండా ఎస్‌.వి.రంగారావు, అంజలీదేవి, సంగీత దర్శకుడు రమేష్‌నాయుడు, జూనియర్‌ శ్రీరంజనిని పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణవేణిదే. మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతులు ఎన్నో చిత్రాలను నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావుతో 11 సినిమాలు నిర్మించడం విశేషం. భర్త మరణం ఆమెను మానసికంగా క్రుంగదీసింది. అక్కినేని నాగేశ్వరరావు సలహా మేరకు మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఫిలింనగర్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు. కుమార్తె అనురాధ నిర్మాతగా చిత్ర నిర్మాణం చేపట్టారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో చేసిన ‘భక్త కుంబార’ అనూహ్య విజయాన్ని సాధించింది. శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు కృష్ణవేణి. ఎన్టీఆర్‌ వంటి మహానటుడిని పరిచయం చేసిన వ్యక్తిగా ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె చేతి నుంచి డబ్బు తీసుకుంటే తమకు కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే కొందరు కొత్త నిర్మాతలు ఆమె నివాసానికి వెళ్లి పలకరిస్తుంటారు. నటిగా, నిర్మాతగా, గాయనిగా ఆరోజుల్లో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణవేణి.. రఘుపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్‌ అభినయ పురస్కారాలను అందుకున్నారు. డిసెంబర్‌ 24తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.