
శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్ శేఖర్. కొద్దికాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివితేటలలో ఫర్వాలేదు. కానీ ఇంటివద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పుడూ టి.వి. చూడటంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టి.వి. చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టి.వి. చూడటం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టి.వి. చూస్తే చదువులో వెనకబడి పోతారని, ఇంటివద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్పు రాలేదు. పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారుచేసుకున్నాడు శేఖర్.
ముందుగా పిల్లల్ని టి.వి. నుండి దృష్టి మళ్ళించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్. సాయంత్రం వరకూ బడిలోనే ఆటలు తనే ఆడించాడు. రోజుకో క్రొత్తరకం ఆట ఆడించాడు, నేర్పించాడు. క్రమేపి పిల్లలు శేఖర్కి చేరువయ్యారు. టి.వి. చూడటం తగ్గించారు. శేఖర్ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటలనుండి శేఖర్ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడు. సాహస గాథలూ, రాజులు, దొంగలు, నీతికథలు… ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్కి పూర్తిగా దగ్గరయ్యారు. పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో వుంచాడు. వారిలో పఠనాసక్తిని పెంచాడు. స్కూల్లో వున్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టి.వి.ని మర్చిపోయారు. శేఖర్ ఆనందించాడు. ఇదే సమయంలో కథలనుండి వారి దృష్టిని పాఠ్యపుస్తకాలపై మళ్ళించాడు. అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటివద్ద చదువుకోవడం ప్రారంభించారు.
పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్థులు శేఖరిన్ని అభినందించారు. ఓ సభ ఏర్పాటు చేసి శేఖర్ను సన్మానించారు. సభలో శేఖర్ వంతు మాట్లాడటం వచ్చింది. మీరందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను. నాకు మీరంతా కలిసి ఓ మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు అనడంతో అందరూ మీరు చెప్పినట్లు చేస్తాం అన్నారు ముక్తకంఠంతో.
చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్పిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వున్నాయి. అందరూ తప్పకుండా రావాలి. నేటినుండే ఆరంభించుకుదాం అని శేఖర్ ముగించాడు. గ్రామస్తులు శేఖరికిచ్చిన మాట ప్రకారం చేసి అందరూ అక్షరాస్యులుగా మారారు. శేఖర్ కల నేరవేరింది. గ్రామస్తులలో, పిల్లల్లో వచ్చిన మార్పుకు శేఖర్ సంతోషించాడు.



