Facebook Twitter
సుమతీ శతకం ఎందుకంత ప్రత్యేకం!

 

 సుమతీ శతకం ఎందుకంత ప్రత్యేకం!

 

 

అక్కరకు రాని చుట్టము, అప్పిచ్చువాడు వైద్యుడు... లాంటి మాటలు నిత్యం మన జీవితంలో వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక శతకంలోని చరణాలంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి పద్యంలోనూ ఒక సామెతనో, జాతీయతనో సృష్టించిన ఆ శతకమే సుమతీ శతకం. తెలుగునాట తొలి శతకాలలో ఒకటిగా సుమతీ శతకాన్ని భావిస్తారు.

సుమతి అంటే మంచి బుద్ధి అని అర్థం. ఆ పద్యం చదివేవాడు అలాంటి సద్బుద్ధి కలగాలనే ఉద్దేశంతో ‘సుమతీ’ అనే మకుటంతో అందులోని ప్రతి పద్యమూ ముగుస్తుంది. ఇంతాచేసి ఈ శతకాన్ని రాసింది ఎవరన్న విషయం మీద మాత్రం స్పష్టత లేదు. కాకపోతే రాణీ రుద్రమదేవి కాలంలో కాకతీయులకు సామంతునిగా ఉన్న బద్దెన భూపాలుడే ఈ శతకాన్ని రచించాడని చాలామంది అభిప్రాయం.

సుమతీ శతకాన్ని ఒకవేళ బద్దెన కవే రాసి ఉంటే... ఈ రచన జరిగి 700 సంవత్సరాలకు పైనే గడిచిపోయి ఉంటుంది. కానీ ఇప్పటికీ అందులోని పద్యాలన్నీ మనకు కంఠస్థం ఉన్నాయంటే, ఆ రచన సులభశైలిలో సాగడమే కారణం. చిన్న చిన్న పదాలు, లయబద్ధంగా సాగిపోయే పాదాలు, వ్యవహారానికి దగ్గరగా ఉండే భాష, నీతి.... అన్నీ కలిసి సుమతీశతకాన్ని చిరస్థాయిగా నిలబెట్టాయి. అటు పండితులని తృప్తి పరిచేలా, ఇటు పామరులకి ఉపయోగపడేలా సాగాయి.

సుమతీ శతకంలో తానేం చెప్పదల్చుకున్నాడో కవి తన మొదటి పద్యంలోనే తేల్చేస్తాడు...
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ
.... అని సాగే ఆ పద్యంలో జనులు మెచ్చుకునేలా చక్కని నీతులని ధారాళంగా చెప్పాలనుకున్న తన ఆశని వెలిబుచ్చుతాడు. ఈ పద్యం తర్వాత అకారాదిగా (alphabetical order) శతకం ముందుకు సాగుతుంది. తెలుగులో ఈ సంప్రదాయానికి నాంది పలికింది బద్దెన కవే అని చెబుతారు.

సుమతీ శతకంలో చాలా పద్యాలలో ఆచరించదగిన నీతి ఉన్నమాట నిజమే! కానీ కొన్ని పద్యాలలో రచయిత పక్షపాత ధోరణ, చిత్రమైన అభిప్రాయాలు కనిపించకమానవు. ముఖ్యంగా స్త్రీలనీ, కొన్ని కులాలనీ, కొందరు అలవాట్లనీ తన పద్యాలలో చులకన చేయడం వల్ల విమర్శకులు మండిపడుతూ ఉంటారు. అలాంటి అభ్యంతరకరమైన పద్యాలని పక్కనపెడితే... ప్రతి తెలుగు విద్యార్థీ జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన పద్యాలు సుమతీశతకంలో చాలానే కనిపిస్తాయి.

- నిర్జర.