Facebook Twitter
బృందావన వనసీమ

మధురా బృందావనంలో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది.  ఇప్పటికీ ఆ ఆనవాళ్లు  ఇంకా ఉన్నాయి. ఒక పండితుడు ,తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగు పై కూర్చుండి,నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు,! క్రమం తప్పకుండా భక్తితో,భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే, ఆ ప్రాంతం వారు, చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందే వాళ్ళు!!

అప్పుడప్పుడూ ,ఆయన తాను చెబుతున్న పురాణం మద్యలో అపి, లోనికి వెళ్ళి వస్తూ , మా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకో బెట్టాను అనీ దుస్తులు ధరింప జేశానని చెప్పేవాడు,
ఇలా రోజూ జరుగుతూ వుండేది...! కానీ గుడిసె లో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట
ఏదికూడా ఎవరికీ వినపడేది కాదు,ఇలా ఏళ్లు గడిచాయి, 

ఒకరోజు ఆయన దేహం చాలించాడు, గ్రామస్తులు చాలా బాధ పడ్డారు,అయ్యో ! ఎంత మంచి వాడు!
ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవద్ కథలు వినిపించి మనలను
తరింపజేశాడే ! మరల ఎవరు ఇంత గొప్పగా చెబుతారు,అంటూ విచారపడుతూ అందరూ అనుకోని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలుచేయడం ప్రారంభించారు !!

మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం వారు లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదు వారికి!! ఒక రోజు ఎదురు చూశారు! పిల్లాడి జాడ లేదు !చివరకు వాళ్ళే అతడి కళేబరాన్ని యమునానది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు!! ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతీ వాడు,నేను పెడతాను అంటే..నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు !ఎందుకంటే, మహా పుణ్యాత్ముడయిన ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా !ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే, దూరం నుండి ఒక పిలుపు వినవచ్చింది వారికి !
ఆగండి.... !! ఆగండి.... !!అంటూ

అందరూ చూస్తుండగా దూరంగా ఒక పదహారేళ్ళ బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు
నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను, చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి !! నన్ను ఒక పని మీద పొరుగూరు పంపించాడు!!

అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది, !!నన్ను క్షమించి, దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి !!అని విచార వదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది,చూశారా! రక్త సంబంధము బలం ఎలా ఉంటుందో...?? ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా, ఇతరులకూ ఆ అవకాశం ఉంటుందా...?? అనుకుని సరే అన్నారు!

ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ,అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు!!
చక్కని పాండిత్యం అందమైన ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే, అక్కడకొచ్చిన వేద పండితులు,పురోహితులు కూడా ఆశ్చర్య పోతున్నారు! ఏమా వర్చస్సు?! ఏమా శాస్త్ర పరిజ్ఞానం...??
ఇంతవరకూ ఎవరూ, కనీ వినీ ఎరుగని శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ దుఖిస్తూు,చితికి నిప్పు అంటించాడు !!

నాయనా ! ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్లు అన్నారు ఊరి పెద్దవాళ్ళు! ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి, నేరుగా వెళ్తూ దాదాపుగా ఒక 20 గజాల దూరం వెళ్ళాక, కనిపించకుండా అంతర్ధానం కావడం వారు అందరూ కళ్ళారా చూశారు, అప్పుడు తెలిసి పోయింది వారికి, ఆ వచ్చినవాడు "కృష్ణయ్య" అని ఇన్నాళ్లూ విన్న భాగవత కథల పుణ్యమా అని, శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహా భాగ్యం లభించింది కదా అంటూ, ఆ బాలుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా, మహదైశ్వర్యముగా స్వీకరించారు వారంతా! ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావనవాసులు!

శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై , భక్తుల పాలిట కల్పతరువుగా అచట ఉంటున్నాడనుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ !!

మా అబ్బాయికి నిద్ర, అహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు, కొడుకు రూపంలో వచ్చి, స్వయంగా కన్న తండ్రి కి కొడుకు చేస్తున్నట్టుగా , శాస్త్ర రీతిలో పద్ధతిగా చేశాడు.అలా పరందాముడే స్వయంగా, అంతిమ క్రియలు చేయడం వాళ్ళు గమనించారు,భక్తుడు ఈ భవ బంధాలను కోరుకోకుండా, నేరుగా భగవంతునితో సంబంధబాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ, పెంచుకుంటూ ముక్తిని పొందాడు !ఆదిత్యయోగీ..

ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపు కు అందక పోవచ్చు!! లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు,,!!
కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని ,
సదా సంరక్షిస్తూ, అతడి యోగక్షేమాలు స్వయంగా చూస్తుంటాడు!!
ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు , అందదు!!
భావాగ్రాహి జనార్దనా !" అంటే భక్తుని అంతరంగం లో కదిలే భావాలను జనార్ధనుడు సదా గ్రహిస్తూ, ఉంటాడు..!!
ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం ! అద్భుతం కూడా !! అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం! ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది కదూ !

నిత్యం అచట సంచరించే సాక్షాత్తూ రాధాకృష్ణుల మృదువైన పాదములు సుతి మెత్తగా తాకుతూ ఉండగా, కలిగే పరమానందాన్ని,అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని నల్లనయ్య ను కోరుకుందాం!!