Facebook Twitter
మార్గ శీర్షి

మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా? కార్తీక మాసం నుంచి  మార్గశిర మాసంలో అడుగు పెట్టాం.. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం.. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు.. మాసానాం మార్గశీర్షాహం.. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు.

హిందూ సంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం.శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిరం. శ్రీమన్నారాయణుడి ఆరాధనతోపాటూ పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీపూజలూ, ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు.
ఇదే విషయాన్ని 'గీత'లో శ్రీక్రిష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ మాసం యొక్క విశేషాలు, ప్రాముఖ్యత, విశిష్టతతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం... మార్గశిరం అంటే.. ‘బృహత్సామ తథాసామ్నాం 
 గాయత్రీ ఛందసా మహం మహం 
 మాసానాం మార్గశీర్షోహ 
రుతూనాంకుసుమాంకం' 
అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు రుతువులలో పుష్ష సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని నేనే, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ క్రిష్ణభగవానుడే వివరించాడు. మొత్తానికి మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట.

హిందువులందరికీ ‘భగవద్గీత' జన్మించిన మాసంగా పరిగణించే పవిత్రమైన మాసం. ఈ మాసమంతా శ్రీమహావిష్ణువును తులసీదళంతో పూజిస్తే పుణ్యం దక్కుతుందని.. పండితులు చెబుతుంటారు. మార్గశిర మాసం ఎన్ని పర్వాలకు నెలవుగా పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మార్గ శిర శుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి' అని దీనినే ‘మోక్ష ఏకాదశి' అనీ అంటారు. ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవున్ని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి నాడే గీతా జయంతి, సమస్త మానవాళికి ధర్మభాండాగారం అయిన భగవద్గీతను క్రిష్ణుడు ప్రబోధించిన రోజు. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తులందరికీ హర్షం ఇచ్చేదే మార్గ శీర్ష మాసం.

ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందనీ, అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేననీ చెబుతాడు కృష్ణుడు. ఈ నెలలో లక్ష్మీ నారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు.  ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలూ, సిరిసంపదలూ వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. ఈ నెలలో ప్రతిరోజూ శుభ ప్రదమైనదే అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలూ ఉన్నాయి. మార్గశిర తదియ నాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం ఉంది. ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద/సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్యషష్ఠి. అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది. కాలభైరవుడు కాశీపట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు.

శునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున శునకాన్ని పూజించి, గారెల దండను శునకం మెడలో వేస్తే మంచిదని చెబుతారు. ఈ నెలలో వచ్చే త్రయోదశినాడు... ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు. దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెబితే... ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయనానికి ముందుండే ధనుర్మాసం ఆరంభం అయ్యేది కూడా ఈ మాసంలోనే. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే... భోగి వరకూ ఈ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో ఆండాళ్‌ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం మొదలైనవాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయాల్లో స్వామికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతారు. అలా పంచడాన్ని బాలభోగం అంటారు. కొందరు వైష్ణవులు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం ఓ సంప్రదాయమే.
ఏడాదిలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశి తిథుల్లో ప్రతిదీ పవిత్రమైనదైనా.. వీటన్నింటిల్లో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని ఏకాదశుల్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే... వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయనానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ‘వైకుంఠ ఏకాదశి’, ‘ముక్కోటి ఏకాదశి’, ‘స్వర్గద్వార ఏకాదశి’, ‘మోక్ష ఏకాదశి’ అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకుంటాయని అంటారు.
దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తిక శుద్ధ ఏకాదశిరోజున మేల్కొంటాడు. అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలూ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే స్వర్గలోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే... మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ మాసంలో మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే... ఆయురారోగ్యాలతోపాటూ సిరిసంపదలూ కలుగుతాయని భక్తుల నమ్మకం.