పిచ్చి వేషాలు వేసినందుకే ఒకసారి దాడి జరిగింది.. మర్చిపోవద్దు ఓవైసీ!!

ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ,  టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి మద్య మాటల యుద్దం కాకరేపుతోంది. టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పరోక్షంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన కొడుకు సాయిను ఉద్దేశించి అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సికింద్రాబాద్ నుండి గెలిచిన ఆ ఎమ్మెల్యే ఒకసారి గెలిస్తే రెండు సార్లు ఓడతారంటూ ఎద్దేవా చేశారు అక్బరుద్దీన్. ఆయన కొడుకును కూడా గెలిపించలేకపోయారన్నారు. తాను ఐదు సార్లు చాంద్రాయణగుట్ట నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నానని అన్నారు. వారికి దమ్ముంటే చాంద్రాయణగుట్ట నుండి పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు అక్బరుద్దీన్ ఓవైసీ. తాను దేశంలో ఎక్కడ నుండైనా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు అక్బరుద్దీన్.

దీని పై అంతే ఘాటుగా స్పందించారు తలసాని సాయికుమార్ యాదవ్. గతంలో బుల్లెట్ దెబ్బలు తిని కత్తిపోట్లకు గురైన ఒవైసీ దేశం కోసం త్యాగం చేయలేదన్నారు సాయి. పిచ్చి వేషాలు వేయటం వల్లే నీపై దాడి జరిగిందని.. ఆ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. మిత్రపక్షం మీద అనవసర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు సాయి యాదవ్.