'కల్కి'కి దారుణమైన కలెక్షన్స్ రావడానికి కారణమిదే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) జూన్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. ఆ అంచనాలను అందుకొని ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ మొదటి రోజు వసూళ్లు మాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేవు. దానికి పలు కారణాలు ఉన్నాయి. (Kalki 2898 AD Collections)

'కల్కి' అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి-2' రికార్డులను బ్రేక్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ తీరా సినిమా విడుదలయ్యాక రూ.190 కోట్ల గ్రాస్ కే పరిమితమైంది. ఓవర్సీస్ లో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. నార్త్ లోనూ పరవాలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. దాంతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా 'కల్కి'కి తక్కువ కలెక్షన్లు రావడం వెనుక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల వర్షాలు కురిశాయి, దానికి తోడు టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అందుకే వసూళ్లకు గండి పడిందని అంటున్నారు. అయితే వీటి కంటే కూడా.. మరో ముఖ్యమైన కారణం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే అధిక టికెట్ ధరలు. తెలంగాణలో ఎనిమిది రోజులు, ఆంధ్రప్రదేశ్ లో రెండు వరాల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. అదే 'కల్కి' పాలిట శాపమైందని చెబుతున్నారు. 

నిజానికి ఇలాంటి సినిమాలకు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. కానీ 'కల్కి' విషయంలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. అసలే మంత్ ఎండ్ కావడం, దానికితోడు అధిక టికెట్ ధరలు కారణంగా కుటుంబమంతా కలిసి వెళ్తే రెండు నుంచి మూడు వేలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు చూడటానికి భయపడ్డారు. ఇక బీ, సీ సెంటర్లలో మాస్ ఆడియన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కంటెంట్ పరంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాకి అట్రాక్ట్ కాలేదు. ఒకవేళ ప్రభాస్ కోసం వెళదామనుకున్నా.. అధిక టికెట్ ధరల కారణంగా వెళ్లలేని పరిస్థితి. అందుకే 'కల్కి' ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి మేకర్స్ టికెట్ ధరల విషయంలో పునరాలోచించాలని, అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, మాస్ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని అంటున్నారు.