టిడిపికి టాప్ ప్రియారిటీ... రామ్మోహన్ నాయుడుకు రెండు కమిటీల్లో చోటు

కేంద్రంలో బిజెపి  మూడోసారి అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమిక వహించింది. మేజిక్ ఫిగర్ దాటేయడానికి ఆ పార్టీ దోహదపడింది.
కేంద్రంలో మూడోసారి అధికార బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ సర్కారు.. మూడు వారాల తర్వాత కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసింది. దేశ భద్రత, పార్లమెంట్ వ్యవహారాలు సహా పలు కీలక కమిటీలను బుధవారం ప్రకటించింది. ఈ కమిటీలలో ఎన్డీఏ కూటమిలోని టీడీపీకి విశేష ప్రాధాన్యం దక్కింది. టీడీపీతో పాటు జేడీయూ, ఎల్జేపీ సహా ఇతరత్రా చిన్న పార్టీలకు కూడా బీజేపీ తగిన ప్రాధాన్యత కల్పించింది. దేశ భద్రత, రక్షణ శాఖ కొనుగోలు వ్యవహారాలు చూసే అత్యున్నత కమిటీలో ప్రధాని మోదీ హెడ్ గా, హోం, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులు మెంబర్లుగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడుకు రెండు కమిటీల్లో చోటు దక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయన ఉన్నారు. అదేవిధంగా, రాజకీయ వ్యవహారాల కమిటీలో బొగ్గు గనుల శాఖ మంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇక, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో మోదీ చోటిచ్చారు.