'వికీపీడియా' తరహాలో 'గాంధీపీడియా'.. కేంద్రం ప్రకటన
posted on Jul 5, 2019 5:11PM

కేంద్ర ప్రభుత్వం ఈరోజు కీలక ప్రకటన చేసింది. 'వికీపీడియా' తరహాలో 'గాంధీపీడియా'ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. గాంధీ జీవిత చరిత్ర గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలని కేంద్రం భావిస్తోంది. స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషిని భారత సమాజం గుర్తుపెట్టుకోవడం కోసం 'గాంధీపీడియా' ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ప్రతి ఏటా అక్టోబర్ 2న గాంధీజీ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈసారి జరుపుకోబోయే గాంధీ జయంతి 150వది కావడం ఒక ప్రత్యేకత. అందువల్ల గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకొని.. గాంధీపీడియా ద్వారా మహాత్ముని విలువలు, ఆయన గొప్పతనంతో పాటు.. ఆయన చేసిన బోధనలను కూడా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.