వైకుంఠపాళి ఆటలో పెద్ద పాము కెసీఆర్ : కాంగ్రెస్ ట్వీట్ 

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 తెలంగాణలో ఇందులో మాత్రమే ఉంది.. అందులో లేదని కాకుండా అన్నింటిలోకి కేసీఆర్ అవినీతి పాకిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో పెద్ద పాము కేసీఆరేనని, ఆయనను మించిన పాము వేరొకటి లేదని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు పోస్ట్ పెట్టింది. పెద్ద పాము కేసీఆరేనని గుర్తించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆయన కోరలు పీకి మూలకు కూర్చోబెట్టారని ట్వీట్ లో పేర్కొంది. అలాంటి పెద్ద పామే పాముల గురించి, తేళ్ల గురించి మాట్లాడటం విచిత్రమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలతో బీఆర్ఎస్ పార్టీ ఓ ట్వీట్ చేసింది. ‘కేసీఆర్ ముందే చెప్పిండు’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోలో ‘పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. కరెంటు కాటగలుస్తది.. కైలాసం వైకుంఠపాళి ఆటలో మళ్లీ పెద్ద పాము మింగినట్లైతది. మళ్లా మొదటికొత్తది కథ’ అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఈ వీడియోను పోస్ట్ చేయగా.. గంట వ్యవధిలోనే 20 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై స్పందించిన కాంగ్రెస్ వెంటనే కౌంటర్ ట్వీట్ చేసింది.