తెలుగుదేశం గూటికి కరణం బలరాం?

ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో  కరణం బలరాం కూడా ఒకరు. చీరాల మాజీ ఎమ్మెల్యే అయిన కరణం బలరాం  గతంలో తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. తెలుగుదేశం తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా  గెలిచిన కరణం బలరాం, 2019 ఎన్నికలలో చీరాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం ఆ తరువాత వైసీపీ గూటికి చేరారు. అంతకు ముందు వరకూ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కరణం బలరాం తెలుగుదేశం వీడి వైసీపీలో చేరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని 2024 ఎన్నికలలో తన స్థానంలో కుమారుడిని పోటీలో దింపాలన్న ఆలోచనతోనే కరణం బలరాం వైసీపీ గూటికి చేరారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.

ఏది ఏమైనా కరణం బలరాం తెలుగుదేశం పార్టీని వీడి జగన్ పంచన చేరడంతో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చీరాల నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కరణం బలరాంకు నిరసన సెగలు తగిలాయి. అయితే వాటిని వేటినీ కరణం బలరాం పట్టించుకోలేదు. ఆయన కోరుకున్నట్లుగానే 2024 ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన కుమారుడు కరణం వెంటేష్ పోటీ చేశారు. అయితే ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ పార్టీ పరాజయం మూటగట్టుకుని రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. 

ఆ తరువాత కరణం వెంకటేష్ కు జగన్ జిల్లా పార్టీ  అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కరణం బలరాం ఆశించారు. అయితే జగన్ మాత్రం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మేరుగ నాగార్జునకు కట్టబెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కరణం బలరాం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుమారుడితో సహా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూర్చే సంఘటన ఒకటి జరిగింది. 

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి వివాహ నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబునాయుడిని కరణం బలరాం పలకరించారు. ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంకయ్యనాయుడు మనవడి నిశ్చితార్ధ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అలాగే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగానే ఆయన చంద్రబాబును కలిసి పలకరించారు. ఇరువురూ కలిసి నవ్వుతూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా కరణం బలరాంతో మాటలకు కలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అంతే కాకుండా కరణం బలరాం తెలుగుదేశం గూటికి చేరుతున్నారన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.