ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా..

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి మంగళవారం విడుదల చేశారు.  ఇంటర్  ఇంటర్ ఫస్టియర్ లో 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా… సెకండ్ ఇయర్ లో 67.16 శాతం మంది పాస్ అయ్యారు. ఇంటర్ ఫలితాల్లో ఈ సారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్టియర్ లో 72.33 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా.. కేవలం 54.25 శాతం మంది అబ్బాయిలు మాత్రమే పాస్ అయ్యారు.

సెకండియర్ లో 59.21 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా… 75.28 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. కాగా ఈ ఫలితాలలో ఫెయిలైన విద్యార్థుల కోసం ఆగస్ట్ 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని సబిత తెలిపారు.

కాగా ఇంటర్ ఫలితాల విడుదలకు ముందు విడుదల తేదీలపై ఒకింత గందరగోళం నెలకొంది. ఈ రోజు, రేపు అంటూ ఇంటర్ ఫలితాలపై సామాజిక మాధ్యమాలలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే 26వ తేదీన తెలంగాణ ఇంటర్ బోర్డు 28న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ వదంతులను నమ్మవద్దంటూ పేర్కొంది. చెప్పినట్లుగానే మంగళవారం ఉదయం ఫలితాలు విడుదల చేసింది.