తెలంగాణా పోలీసులు అమిత్ షా ను అరెస్టు చేస్తారా? రేవంత్ దూకుడు..

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదైంది.  కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేశారు. అస‌లు కేసు ఏమిటంటే, ఇటీవ‌ల హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే వేళలో.. కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారని.. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డులో కమలంపువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉంది.  ఇలా ప్రచారం చేయటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అమత్ షా ఉల్లంఘించినట్లుగా ఈమొయిల్ ద్వారా కాంగ్రెస్  నేత‌లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు. 

చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు.  అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా యమాన్ సింగ్.. ఏ2గా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. ఏ3గా అమిత్ షా.. ఏ4గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు.

ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై డీప్ ఫేక్ వీడియో కేసు వెంటాడుతున్న‌ వేళ, అంతే స్థాయిలో అమిత్ షా మీద మరో కేసును సిద్ధం చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా మీద కేసు పెట్టేంత ధైర్యం చేయ‌డం దేశ రాజ‌కీయాల్లోనే ఉత్కంఠ‌గా మారింది.  

సి.ఎం. రేవంత్‌రెడ్డి దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురి మీద కేసు నమోదు కావటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఈ కేసును ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు సి.ఎం. రేవంత్‌ను అరెస్ట్ చేస్తారా? లేక తెలంగాణా పోలీసులు అమిత్‌షాను అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ‌త నెల‌కొంది.