సైకిల్ కోసం తండ్రినే చంపాడు

ఆస్తుల కోసం..డబ్బు కోసం తండ్రిని కడతేర్చిన వారిని చూశాం..కానీ సైకిల్ కోసం కన్నతండ్రినే చంపాడు ఒక కసాయి కొడుకు. పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి మండలం పాళ్లూరు గ్రామానికి చెందిన రత్నరాజు, ఆనందబాబు తండ్రి కొడుకులు..గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ తాగి గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లి ఇంటికి వచ్చిన ఆనందబాబు ఇంట్లో సైకిల్ లేదని తల్లిని అడుగ్గా ఆమె మీ నాన్న తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆనందబాబు తల్లిని కొట్టాడు...అదే సమయంలో సైకిల్‌తో పాటు ఇంటికి వచ్చిన తండ్రి రత్నరాజుతో మళ్లీ గొడవపడ్డాడు. ఈ వాగ్వివాదంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆనందబాబు పక్కనే ఉన్న కత్తితో తండ్రిపై దాడి చేశాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అందుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.