జగన్ కాళ్ల బేరాలు.. కాంగ్రెస్ నుంచి ఛీత్కారాలు!
posted on Oct 23, 2024 10:10AM
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందులు మొదలయ్యాయి. అధికారంలో కొనసాగిన ఐదేళ్లు తన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన జగన్కు.. ఇప్పుడిప్పడే జ్ఞానోదయం అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. అధికారం మత్తులో జగన్, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైనేకాక.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించారు. 2019 ఎన్నికల్లో తన గెలుపులో కీలక భూమిక పోషించిన కుటుంబ సభ్యులను సైతం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ దూరం చేసుకున్నాడు.
ఇటీవల ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జగన్ పాత కేసులతో పాటు.. అధికారంలో ఉన్న సమ యంలో పాల్పడిన అవినీతి అక్రమాల కేసులు కూడా రెడీగా ఉన్నాయి. దీంతో త్వరలో జగన్, వైసీపీలోని ముఖ్యనేతలు జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గడిచిన ఐదేళ్ల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోయిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. గతంలో జగన్ ఏం చేసినా కేంద్రంలోని బీజేపీ పెద్దలు అండగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పార్టీలతో బీజేపీ పొత్తులో ఉంది. దీంతో జగన్ ఏకాకి అయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి పార్టీల మధ్య పొత్తులు, నేతల మధ్య సంబంధాలు మారుతుంటాయి. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత ఒటరి అయిన జగన్.. జాతీయ స్థాయిలో పలుకుబడి ఉండాలంటే ఏదో ఒక జాతీయ పార్టీతో సంఖ్యతతో ఉండాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లు బీజేపీ జగన్ కు మద్దతుగా నిలవగా.. జగన్ ఐదేళ్ల అరాచక పాలనను చూసి ఆ పార్టీ తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకొని ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. దీంతో జగన్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు అనివార్యమైంది.
గతంలో కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదని జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అంతేకాక.. సోనియా, రాహుల్ గాంధీపై వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు. సింహం సింగిల్ గా వస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి పొత్తులూ మద్దతులూ అవసరం లేదని విర్రవీగారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ తో కలవాల్సిన పరిస్థితి జగన్ కు ఏర్పడింది. దీంతో ఆమేరకు జగన్ మంతనాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయాలంటే ముందుగా చెల్లెలు షర్మిలతో విబేధాలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు. షర్మిల ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనను ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. జగన్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడానికి షర్మిల కూడా ఓ కారణమని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.
వైఎస్ఆర్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జగన్ వెంట ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్దతుగా షర్మిల విస్తృత ప్రచారం చేశారు. జగన్ జైలుకెళ్లిన సమయంలో పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపులో షర్మిల కీలక భూమిక పోషించారు. తండ్రి మరణం తరువాత జగన్కు అండగా షర్మిల నిలబడ్డారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలను జగన్ పూర్తిగా విస్మరించారు. వాస్తవానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికిఉన్న సమయంలో తన ఆస్తిలో షర్మిళకుకూడా సమాన వాటా ఉండాలని పలుసార్లు ప్రస్తావించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలకు వాటా ఇచ్చేది లేదని చెప్పడంతోపాటు.. ఆమెను పార్టీ నుంచి పక్కకు తప్పించారు. షర్మిలతోపాటు తల్లి విజయమ్మ సైతం పార్టీకి దూరం అయ్యారు. ఆ తరువాత కొద్దికాలం తెలంగాణ రాజకీయాల్లో కొనసాగిన షర్మిల.. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతోపాటు.. షర్మిల జగన్ గురించి చెప్పిన నిజాలను ప్రజలు బలంగా నమ్మారు. దీంతో వైసీపీ అధికారం కోల్పోవడంతోపాటు.. కనీసం ప్రతిపక్ష హోదాకూడా నిలబెట్టుకోలేక పోయింది.
అధికారం కోల్పోవడంతో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి కొంతైనా తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి జగన్ తాపత్రయ పడుతున్నారు. బెంగళూరు వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా జగన్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. అయితే, షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండటంతో ఆమెతో ఉన్న విబేధాలకు స్వస్తి చెప్పేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. షర్మిల వద్దకు కాళ్ల బేరానికి వచ్చి ఆమెకు తండ్రి ఆస్తిలో రావాల్సిన వాటాను ఇచ్చేందుకు జగన్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో దోస్తీకోసం అన్నిఅడ్డంకులను తొలగించుకోవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జగన్ మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేదు. జగన్ తీరుపట్ల వేచి చూసే ధోరణిలో రాహుల్, సోనియా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు జగన్ ను కలుపుకునే విషయంలో కాంగ్రెస్ లో మెజారిటీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అందుకే జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ తటపటాయిస్తోంది. వాస్తవానికి జగన్ తో దోస్తీకి రాహుల్ గాంధీ ససేమీరా అంటున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ అరాచక పాలన సాగించడమే. ఎలాంటి తప్పు చేయని చంద్రబాబును జైళ్లో పెట్టడంతోపాటు, సొంత చెల్లి షర్మిలను జగన్ ఇబ్బందులకు గురిచేయడాన్ని రాహుల్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహల్ గాంధీ ధోరణి చూస్తుంటే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి జగన్ దగ్గరయ్యే అవకాశాలు లేవనే విషయాన్ని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఓటమి తరువాత ఎవరితో ఎలా ఉండాలనే విషయం జగన్ మోహన్ రెడ్డికి బోధపడిందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.