‘టైగర్ నాగేశ్వరరావు’కి ఏపీ హైకోర్టు షాక్!
posted on Aug 31, 2023 10:29AM
![](/teluguoneUserFiles/img/ap%20high%20court%20notices%20to%20tiger%20nageswara%20rao%20movie%20producer.webp)
మాస్ మహారాజా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రీసెంట్గా విడుదలైంది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే అదే ఇప్పుడు చిత్ర యూనిట్కు సమస్యగా మారింది. ఈ టీజర్లో ఉపయోగించిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి ఆకుల వెంకట శేషషాయి ధర్మాసనం టీజర్పై అభ్యంతరాన్ని తెలియజేసింది. సెన్సార్ అనుమతి లేకుండా టీజర్ ఎలా విడుదల చేశారని ప్రశ్నిస్తూ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్కు కోర్టు నోటీసులను జారీ చేసింది.
‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ఎరుకల సామాజిక వర్గం మనోభావాలను కించపరిచేలా ఉందని చుక్కా పాల్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. దీనిపై హైకోర్టు టీజర్లో ఉపయోగించిన భాషపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ నోటీసులు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో సినిమాలను రూపొందించరాదని పేర్కొంటూ ఇందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ను ప్రతివాదిగా చేర్చాలని సూచించింది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ పిల్కి సంబంధించి తదుపరి విచారణను సెప్టెంబర్ 27కి వాయిదా వేశారు.
స్టూవర్టుపురంలో ఒకప్పుడు పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు జీవితకథతో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్కి సిద్ధమవుతోంది.