హస్తినలో బాబు బిజీబిజీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు హస్తిన పర్యటన జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం తరువాత ఆయన హస్తిన పర్యటనకు వెళ్లడం ఇదే మొదటి సారి. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

చంద్రబాబు హస్తిన పర్యటన ప్రధాన లక్ష్యం రాష్ట్ర అవసరాలను, ప్రాధాన్యతలను ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులకు వివరించడం, బడ్జెట్ లో ఏపీకి భారీ కేటాయింపులు ఇవ్వాలని కోరడం.   ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రమంత్రులకు వివరించి ఆర్థికంగా రాష్ట్రానికి సహాయం అందించాలని చంద్రబాబు తన పర్యటనలో  భాగంగా మోడీతో భేటీలో కోరే అవకాశాలున్నాయి. అలాగే మౌలిక వసతుల కల్పన విషయంలోనూ ఏపీకి సాయం చేయాలని చంద్రబాబు కోరతారని తెలుస్తోంది.  ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి , రహదారుల మరమ్మతులు, పేదలకు ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు తదితర అంశాలలో కేంద్రం ఇతోధికంగా సహకారం అందించాలని  చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయి.

కాగా తన హస్తిన పర్యటనలో చంద్రబాబు క్షణం తీరిక లేకుండా బిజీగా గడపనున్నారు. గురువారం (జులై 4)  వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ  అయ్యారు. ఆ తరువాత  ప్రధాని మోడీతో భేటీ , మధ్యాహ్నం 12 : 15గంటలకు రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం ఉన్నాయి.  ఇక మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , తదుపరి   కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో  అవుతారు. శుక్రవారం (జులై 5)   ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో భేటీ , అనంతరం 10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం, అలాగే 10 : 45 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ  ఉంటుంది. మధ్యాహ్నం 12 : 30గంటలకు మంత్రి అథవాలేతో సమావేశం అవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం హస్తిన నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.  శనివారం(జులై6) తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రె్డితో భేటీ అవుతారు. ఈ భేటీలో విభజన సమస్యలపై చర్చిస్తారు.