సగానికి పైన జబ్బులన్నీ దీనివల్లే!

శరీరం సరైన రీతిలో పనిచేయడానికి ప్రతిరోజూ వివిధ రకాల విటమిన్లు  సూక్ష్మపోషకాలు అవసరమవుతాయి. ఇవన్నీ  ఆహారం నుండి సులభంగా పొందవచ్చు, అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని  క్రమం తప్పకుండా తినాలని చెబుతారు. అయితే అదే ఆహారం విషయంలో చేసే పొరపాట్ల కారణంగా   శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది శరీరంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.  మెగ్నీషియం కూడా  అలాంటి  మూలకమే..  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం. మెగ్నీషియం లోపం అనేక వ్యాధుల సమస్యల ప్రమాదాన్ని  పెంచుతుంది . మెగ్నీషియం  మెదడు,  శరీరం  రెండిటికీ ముఖ్యమైనది. ఇది గుండె, రక్తంలో చక్కెర స్థాయిలు,  మానసిక స్థితి సహా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఆకు కూరల నుండి గింజలు, బీన్స్ వరకు ఎన్నో ఆహారాలలో కనిపిస్తుంది. అసలు మెగ్నీషియం లోపం ఎందుకు ఎలా వస్తుంది?? ఆహారంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు అందరికీ ఎందుకు సలహా ఇస్తారో.. దాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుంటే..  శరీరంలో మెగ్నీషియం లోపం.. పెద్దలు వారి శరీరంలో 25 గ్రాముల మెగ్నీషియం కలిగి ఉంటారు, వీటిలో అస్థిపంజర వ్యవస్థ 50-60% నిల్వ చేస్తుంది. మిగిలినవి శరీరంలోని కండరాలు, కణజాలాలు,  ద్రవాలకు ఉపయోగం. మెగ్నీషియం లోపం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి బోలు ఎముకల వ్యాధి, మానసిక ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు, నరాల సంబంధిత రుగ్మతలతో పాటు రక్తంలో చక్కెర పెరుగుదలకు కూడా కారణమవుతుంది.  మెగ్నీషియం ఎందుకు అవసరం?? విటమిన్-డి, కాల్షియంతో పాటు ఎముకలకు మెగ్నీషియం  కూడా అవసరం. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి మెగ్నీషియం అవసరమవుతుంది. మెగ్నీషియం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రతను పెరుగుతుంది,  రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-డి స్థాయిలను నియంత్రించడంలో  కూడా సహాయపడుతుంది. కాబట్టి మెగ్నీషియం శరీరానికి చాలా వసరం. మధుమేహాన్ని నియంత్రిస్తుంది..   టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు చాలా ఉపయోగపడతాయి.. మెగ్నీషియం గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  మెగ్నీషియం లోపం ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉంటుంది. అయితే మెగ్నీషియం ను సప్లిమెంట్స్ కంటే ఆహరంతో తీసుకోవడం ఎంతో మంచిది.  మెగ్నీషియం కోసం ఏమి తినాలి? మగవారికి ప్రతిరోజూ 400-420 గ్రాముల మెగ్నీషియం  అవసరం అయితే ఆడవారికి 340-360 గ్రాములు అవసరం.  గింజలు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి అనేక ఆహారాలలో మెగ్నీషియం అధిక స్థాయిలో ఉంటుంది. అవకాడో, బంగాళదుంప, అరటిపండు మొదలైన వాటి నుంచి కూడా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తుంది. వీటిని తీసుకుంటే మెగ్నీషియం లోపాన్ని నివారించవచ్చు.                                            *నిశ్శబ్ద.

read more
ఈ లక్షణాలు వుంటే గుండె పరీక్ష చేయించుకోవాలి.. లేకపోతే ప్రాణాలకు ముప్పే

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బు ఒకటి. గణాంకాల ప్రకారం కరోనరీ హార్ట్ డిసీజ్ (CAD) అనేది గుండె జబ్బులలో అత్యంత సాధారణ సమస్య. ఇది 2021లో 3.75 లక్షలకు పైగా మరణాలకు కారణమైంది. 20, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి  20మందిలో ఒకరు ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం గణనీయంగా ఉంది.  దురదృష్టవశాత్తు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఈ సమస్య ఎదురైన మొదట్లో చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లాలంటే భయపడతున్నారు, సమస్య ఏమీ లేదులే అనే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా  సకాలంలో రోగనిర్ధారణ  జరగడం లేదు. అదే సకాలంలో సమస్య నిర్థారణ జరిగితే  తీవ్రమైన గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించి, రోగి ప్రాణాలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇదివరకే  గుండె జబ్బులు లేకపోయినా, ప్రతి ఒక్కరూ తమ గుండెను సంవత్సరానికి రెండుసార్లు పరీక్ష చేయించుకోవడం నేటికాలపు పరిస్థితులలో మంచిదని వైద్యులు చెబుతున్నారు. యువతలో గుండె జబ్బుల సమస్య.. యువతలో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, ఇందులో ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్,  అధిక రక్తపోటు ప్రధానమైనవి. అమెరికన్లలో గుండె జబ్బుల బారిన పడుతున్నవారిలో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్,  ధూమపానం మొదలయిన వాటిలో కనీసం ఒకదానిని అయినా అలవాటుగా  కలిగి ఉన్నారు. గుండెలో సమస్య ఉండవచ్చని సూచించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎదురైన మరుక్షణమే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. తరచుగా ఊపిరి ఆడకపోవడం..  తరచుగా శ్వాస ఆడకపోవడాన్ని ఎదుర్కుంటున్నట్టైతే  అది గుండె సమస్యకు సంకేతంగా చెప్పవచ్చు. ఈ సమస్యను వైద్యపరంగా డిస్ప్నియా అంటారు. ఈ  పరిస్థితి తీవ్రమైన సమస్యగా  పరిగణించబడుతుంది, ఈ సమస్య ఎదురైనప్పుడు  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.  గుండె సంబంధిత, శ్వాసకోశ సమస్యలు తరచుగా ఇంటి పనులు చేయడం,  మెట్లు ఎక్కడం వంటి పరిస్థితుల వల్ల  తీవ్రమవుతాయి. ఛాతీ నొప్పి.. ఛాతీ నొప్పి కూడా  గుండెలో సమస్య ఉండవచ్చని చెప్పడానికి  ప్రధాన సంకేతంగా పరిగణింపబడుతుంది. పదేపదే  వచ్చే ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.  ఈ నొప్పిని పెయిన్ కిల్లర్లు ఇతర  మందులతో అణిచివేసేందుకు ప్రయత్నించకూడదు. కొలెస్ట్రాల్ లేదా రక్తపోటు తరచుగా పెరిగిన వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి రోగులే తరచుగా శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇటువంటి లక్షణాలను తేలికగా తీసుకోవడంలో పొరపాటు చేయకూడదు. ఒకే తరహా జీవనశైలి.. ఒకే తరహా  జీవనశైలి లేదా  రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉండాల్సి వస్తుంటే  అలాంటి సమయాల్లో  జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండెకు హాని కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తపర్సరణ వ్యవస్థ మందగిస్తుంది.ఇలాంటి వారు  గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఈ ప్రమాదం  దుష్ప్రభావాలు దరిచేరకుండా ఉండేందుకు  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.                                                                    *నిశ్శబ్ద.

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఊపిరితీసే ఈ క్యాన్సర్ ను నియంత్రించకపోతే కష్టమే..

మానవ శరీరంలో ఊపిరితిత్తులు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. ఇవి శరీర శ్వాస వ్యవస్థకు మూలకారణం. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ ను గ్రహించి, కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఇవి సహాయపడతాయి. ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేకపోతే శరీరానికి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించి  ఎదురయ్యే సమస్యలలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముఖ్యమైనవి. ఇవి చాలా తీవ్రమైన సమస్యలుగా కూడా పరిగణించబడతాయి. ఒకప్పుడు ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే వస్తుందని అనుకునేవారు. ధూమపానం, మధ్యపానం అలవాట్లు ఉన్నవారికి వస్తుందని అనుకునేవారు. కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రస్తుతం యువతను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం ఆగష్టు 1వ తేదీన ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణా చర్యలు మొదలైన వాటి గురించి చర్చిస్తారు. ఏ కారణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రభావం పెరుగుతుందో తెలుసుకుంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ చరిత్ర ఏమిటంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ప్రస్తుతకాలంలో ఎంతోమందిని వేధిస్తున్న సమస్య. ఇది మనిషిని కబళించే వరకు బయటపడదు. దీని కారణంగా ఈ సమస్య వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయి. మొదట్లో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి సరైన ఆధారాలేవీ లభించలేదు. కానీ 1940- 50 సంవత్సరా మధ్య  చేసిన పరిశోధనలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ధూమపానం వల్ల కలుగుతుందని సాక్ష్యాలను చూపించినప్పుడు   నికోటిన్,  పొగాకు వల్ల  దుష్ప్రభావాలు కలుగుతాయని  ప్రజలు  గ్రహించారు. 21వ శతాబ్దం నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత జబ్బులు సాధారణ మరణాల పట్టిక స్థాయిలో  నమోదయ్యాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్  లక్షణాలు..  తరచుగా దగ్గు లేదా న్యుమోనియా సమస్య చికిత్స తీసుకున్న తర్వాత కూడా తిరిగి వస్తుంటే అది ఊపిరితిత్తుల క్యాన్సర్  ప్రారంభ లక్షణాలుగా  పరిగణించబడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్  అత్యంత సాధారణ లక్షణాలలో  ఎప్పుడూ దగ్గు వేధిస్తూ ఉంటుంది. ఇంకా  శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, బొంగురుపోవడం, అనూహ్యంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు  జీవనశైలిలో  అనేక  అలవాట్లు  కారణం అవుతాయి. ఈ అలవాట్ల నుండి జాగ్రత్త పడితే తప్ప ఈ సమస్యను దూరం పెట్టలేరు. ఎక్కువ మందిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమయ్యే అలవాట్లు.. ధూమపానం ..  smoking kills అని, smoking causes throat cancer అని ఇలా ప్రతీ సిగరెట్ ప్యాకెట్ మీదా బోలెడు  హెచ్చరిక రాసి ఉంటారు. ఇలా రాసినా కూడా ధూమపానం అంటే పడిచచ్చేవాళ్లు ఉన్నారు. సిగరెట్లు లేదా ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్,  క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)కి ప్రధాన కారణం. సిగరెట్ పొగ శ్వాసనాళాలను కుచించుకుపోయేలా  చేస్తుంది.  శ్వాస తీసుకోవడాన్ని  కష్టతరం చేస్తుంది. ఇది ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. కాలక్రమేణా, సిగరెట్ పొగ ఊపిరితిత్తుల కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇండోర్ కాలుష్యం.. పేలవమైన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ (IAQ) కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మనందరం రోజులో ఎక్కువ సమయం ఇళ్లు, ఆఫీసుల్లోనే గడుపుతాం కాబట్టి గాలి నాణ్యత సరిగా లేకుంటే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. సాధారణంగా బయటి గాలి చాలా కలుషితమని అనుకుంటాం. కానీ ఇంటి లోపల గాలి బయటి గాలి కంటే ఎక్కువ  కలుషితమవుతుంది.  దీని కోసం గదిలోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకోవడం ఎంతో అవసరం. కిటికీలు, తలుపుల ద్వారా గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. గాలిని ఫిల్టర్ చేసే మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవాలి.  ఇంటి చుట్టు ప్రక్కల గాలి కాలుష్యానికి కారణమయ్యే వాతావరణాన్ని నిషేదించాలి.  కలుషిత నీటిలో , ముఖ్యంగా తాగే నీటిలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . దేశంలోని పలు ప్రాంతాలలో నీటిలో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువగా ఉండటం ఆరోగ్య నివేదికలను కలవర పెడుతున్నవిషయం. కొన్ని ఆసక్తికర విషయాలు.. జర్మన్ వైద్యుడు ఫ్రిట్జ్ లిక్కింట్ తన స్వదేశంలో ధూమపానానికి వ్యతిరేకంగా పోరాడాడు. అతను ప్రచురించిన ఒక నివేదిక  ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు,  ధూమపానానికి మధ్య అధిక సంబంధాన్ని రుజువు చేసింది. అధికారిక సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 1.80 మిలియన్ల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్నారు, అయితే 2.21 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి.  చాలా చిన్నవిగా కనిపించే ఈ రెండు సమస్యలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని సరిదిద్దుకోవడం ఎంతో అవసరం.                                                               *నిశ్శబ్ద.

read more
ఈ పదార్థాలు ఆహారంలో భాగం చేసుకుంటే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది..

ఇప్పటి ప్రజలలో పోషకాహార లోపం చాలా ఎక్కువ. ఈ కారణంగా చాలామంది విటమిన్, ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే ఈ  సప్లిమెంట్ల వల్ల శరీరం తాత్కాలికంగా ధృఢంగా మారుతుందే తప్ప దీర్ఘకాల బలాన్ని ఇవ్వదు. అందుకోసం ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ ఖర్చుతో కూడుకున్నదని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. అందరికీ అందుబాటులో లభించే ప్రోటీన్ ఫుడ్ లు ఉన్నాయి. వీటిలో నాలుగు గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ నాలుగు ప్రోటీన్ ఫుడ్స్ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం ఉక్కులా మారుతుందని స్వయానా ఫిట్ నెస్ ట్రైనర్లే చెప్పడం గమనార్హం. ఇంతకూ శరీరానికి కావలసిన పోషకాలను సమృద్దిగా అందించే ఫుడ్స్ ఏంటో తెలుసుకుంటే.. కాయధాన్యాలు.. కాయధాన్యాలు ప్రోటీన్ కు మంచి మూలం. 50గ్రాముల నల్లశనగలు, సోయాబీన్, వేరుశనగలు తీసుకోవాలి. మరొకవైపు 50గ్రాముల పెసలు నానబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా నానిన తరువాత వీటిని ఒక వస్త్రంలో వేసి మొలకలు తెప్పించాలి. ఈ మొలకలను అన్నింటినీ బాగా మిక్స్ చేసి మూడు నుండి నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. వీటిలో రోజులో అప్పుడప్పుడు తినాలి. ఇలా చేస్తే శరీరానికి కావలసినంత బలం చేకూరుతుంది. ఇది శరీరాన్ని ఉక్కులాగా మార్చే పదార్థం కూడా. పాలు, పెరుగు, జున్ను.. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ లోపాన్ని నివారించడానికి  100 గ్రాముల వరకు జున్ను తీసుకోవచ్చు. లేకపోతే అరలీటర్ పాలు లేదంటే 400గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. వీటి ద్వారా ప్రోటీన్ పుష్కలంగా లబిస్తుంది. సోయా.. సోయా ఇప్పట్లో చాలా విరివిగా వాడుతున్నారు. సోయా గ్రాన్యుల్స్ నుండి సోయా చుంక్స్ అని సోయా పిండి అని సోయా నూడిల్స్ అని చాలా రకాలుగా ఉంటున్నాయి. అయితే శాఖాహారం తినేవారికి సోయాబీన్స్ సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఇది ఒక్కటే ఎన్నో రకాల పోషకాలను భర్తీ చేస్తుంది. 60-80గ్రాముల సోయా బీన్ లో బోలెడు ప్రోటీన్ ఉంటుంది. నట్స్.. పుట్టగొడుగులు.. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ మొదలైనవి నట్స్ లో పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఓ గుప్పెడు నట్స్ తిననవచ్చు. అలాగే 100గ్రాముల పుట్టగొడుగులు కూడా ప్రోటీన్ ను భర్తీ చేస్తాయి. ఈ నాలుగు ఆహారాలు రోజులో తప్పకుండా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటే పోషకాహార లోపం మీనుండి పరిగెత్తి వెళ్లిపోతుంది. శరీరం ఉక్కులా ధృఢంగా మారుతుంది.                                                *నిశ్శబ్ద.

read more
యువతలో స్ట్రోక్ ప్రమాదానికి ఈ మూడే ముఖ్య కారణం!

కొన్ని సంవత్సరాల  క్రితం వరకు పక్షవాతం, మెదడు సంబంధిత వ్యాధులను వృద్ధాప్య సమస్యలుగా చెప్పేవారు.  ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా మరచిపోయినా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నా అప్పుడే ముసలాడివైపోయావా ఏంటి? అని అంటుంటారు. ఇది కాస్త వెటకారంగా అనిపిస్తుంది కానీ ఇందులో నిజం అదే..  ఇవన్నీ వృద్దాప్యంలో శరీర సామర్థ్యం తగ్గడం వల్ల ఏర్పడేవి. కానీ  ఇప్పుడు యువత కూడా వీటి బారిన పడుతున్నారు. ప్రస్తుతం యువతలో పెద్ద సంఖ్యలో  ఈ ప్రమాదం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడులో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏర్పడే ఈ సమస్య కొన్ని సందర్భాల్లో పక్షవాతం,  మరణానికి కూడా దారి తీస్తుంది. ఏ వయసు వారైనా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని  కూడా  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నరాల సమస్యలు కూడా అనేక రకాల సమస్యలను పెంచుతున్నాయి. యువకులలో స్ట్రోక్ రావడానికి,  వృద్ధులలో స్ట్రోక్ రావడానికి కారణాలు ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే వృద్దులలో వయసు పైబడటం వల్ల ఈ సమస్య వస్తే, యువతలో  ఇతర కారణాల వల్ల వస్తుంది.  స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు యువతలో ఈ ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఈ కింది సమస్యలు స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి.  అధిక రక్తపోటు సమస్య.. యువతలో అధిక రక్తపోటు సమస్య చాలా సాధారణమైనదిగా కనిపిస్తుంది. చాలా మంది ఉడుకు రక్తం, అందుకే ఆవేశపడతారు అని సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న స్థితిలో, ధమనుల గోడలపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో  చీలిక ఏర్పడటం లేదా  రక్త సరఫరాకు అడ్డుపడటానికి దారితీస్తుంది. ఇస్కీమిక్ స్ట్రోక్ వంటి అథెరోస్క్లెరోసిస్‌కు హైపర్‌టెన్షన్ ప్రధాన కారణమని తేలింది. ఇప్పట్లో అధిక రక్తపోటు 20-40 సంవత్సరాల వయస్సు గల ఎనిమిది  మందిలో  ఒకరిని  ప్రభావితం చేస్తోంది. మధుమేహం.. నేటికాలం యువతలో మధుమేహం సమస్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది. అది కూడా స్ట్రోక్ రిస్క్‌తో ముడిపడి ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువ. మధుమేహం సమస్య  నరాలను ప్రభావితం చేస్తుంది, దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది.  ధూమపానం... యువతకు ధూమపానం ఒక ఫ్యాషన్ గా తయారయింది. సిగరెట్ తాగేవారు హీరోలన్నట్టు, అసలైన మగాళ్లు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ ధూమపానం  స్ట్రోక్ ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. 2018 అధ్యయనం ప్రకారం  15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల మగవారిని సుమారు మూడు సంవత్సరాల పాటు పరిశీలించింది. ఇందులో ప్రతిరోజూ సిగరెట్ తాగే వ్యక్తులకు ఇతర వ్యక్తుల కంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని పరిశోధకులు కనుగొన్నారు. ధూమపానం స్ట్రోక్‌కు దారితీసే అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచుతుంది.  శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తనాళాల్లో ఉండే కణాలకు నష్టం చేకూరుస్తుంది. రక్త నాళాలు చిక్కగా లేదా ఇరుకైనవిగా మారుస్తుంది. కాబట్టి ఈ మూడు విషయాల్లో యవత జాగ్రత్తగా ఉంటే స్ట్రోక్ ప్రమాదం నుండి గట్టెక్కవచ్చు.                                                           *నిశ్శబ్ద.

read more
శాకాహారులలో విటమిన్ బి-12 లోపమా...ఈ మూడు ఆహారాలతో భర్తీ చేయచ్చు...

శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో విటమిన్-బి12 ఒకటి, ఇది  శరీరంలోని రక్తం,  నరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం ఉన్న వ్యక్తులకు బలహీనత, తిమ్మిరి, నడవడానికి ఇబ్బంది, వికారం, బరువు తగ్గడం, చిరాకు, అలసట,  హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ విటమిన్  దీర్ఘకాలిక లోపం మెదడు దెబ్బతినడానికి,  రక్తహీనతకు కూడా దారితీస్తుంది. అందుకే ఈ విటమిన్ ను  శరీరానికి కావసినంత అందించడం చాలా ముఖ్యం.  చాలామంది  విటమిన్ బి-12 కేవలం మాంసాహారంలో లభిస్తుందని అనుకుంటారు. దీనికి తగ్గట్టు ఈ విటమిన్ బి-12లోపం ఎక్కువగా శాకాహారులలోనే ఏర్పడుతుంటుంది.  అయితే శాకాహారులు కూడా విటమిన్ బి-12 ను  సులువుగానే పొందవచ్చు. కేవలం మూడు పదార్థాలు ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. ఈ విటమిన్ లోపాన్ని జయించవచ్చు.  ఇంతకూ ఈ విటమిన్ బి-12  సులువుగా లభ్యమయ్యే మూడు ఆహారాలు ఏవో తెలుసుకుంటే.. అరటిపండు.. అరటిపండు అత్యంత పోషకాలు,  విటమిన్లు అధికంగా ఉండే పండ్లలో ఒకటి. అరటిపండ్లు తీసుకోవడం ద్వారా విటమిన్ బి12  చాలా సులువుగా పొందగలుగుతాం. రోజులో శరీరానికి కావలసిన బి-12 విటమిన్ ను భర్తీ చేయడంలో అరటిపండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది అందరికీ, అన్ని సీజన్ లలో అందుబాటులో ఉంటుంది. ధర కూడా తక్కువ.  అరటిపండులో విటమిన్లతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మలబద్ధకం,  అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. మొత్తం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తి అరటిపండుకు ఉంది. బీట్ రూట్.. బీట్‌రూట్‌లో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. దీనిని విటమిన్ బి12 పవర్‌హౌస్ అంటారంటే బీట్ రూట్ బి-12 విటమిన్ కు ఎంత మంచి ఆప్షనో అర్థం చేసుకోవచ్చు. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరగడం, రక్తహీనతను తొలగించడం,  రక్తపోటు సమస్యను తగ్గించడం  వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్-బి12 లోపం వల్ల కలిగే సమస్యలను   సులభంగా అధిగమించవచ్చు. శనగలు.. చికెన్, ఇతర  మాంసాహారం తీసుకునేవారికి  బి-12 విటమిన్ సమృద్దిగా అందుతుంది. అయితే మాంసాహారం తీసుకోని  వారికి బీట్రూట్, అరటిపండుతో పాటు శనగలు ఉత్తమ ఎంపిక. నల్ల శనగలు విటమన్ బి-12 ను సమృద్దిగా కలిగి ఉంటాయి.   విటమిన్-బి12తో పాటు ఫైబర్, ప్రొటీన్లు,  అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. శరీరం ఐరన్  గ్రహించే శక్తిని  పెంచడంలో,  ప్రోటీన్ ను గ్రహించడంలో శనగలు  దోహదం చేస్తాయి. శనగలు మొలకలు తెప్పించి తినడం లేదా నానబెట్టిన శనగలు తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.                                                                     *నిశ్శబ్ద.

read more
మధుమేహం కంట్రోల్ లో లేదా..ఈ నాలుగు పదార్థాలు వాడితే చాలు..

డయాబెటిస్‌ను 'సైలెంట్ కిల్లర్' అని వర్ణించారు. అంటే ఇది శరీరాన్ని లోపల నుండి దెబ్బతీస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించకపోతే, మధుమేహ రోగులలో గుండె జబ్బులు, కళ్ళు, నరాలతో పాటు తీవ్రమైన కిడ్నీ-కాలేయం వ్యాధుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మధుమేహం సమస్య ఉన్నవారు చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చక్కెర స్థాయిలు  అదుపులో ఉన్నవారు ఆ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పడాలి.  చాలామంది మధుమేహం పెద్దవారిలో మ్రమే వస్తుందని అనుకుంటారు. కానీ మధుమేహం ఎవరికైనా వస్తుంది. ముఖ్యంగా  పిల్లల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం  వేగంగా పెరుగుతోందని  వైద్యులు చెబుతున్నారు. అయితే కేవలం నాలుగు నాలుగు పదార్థాలు తీసుకుంటూ ఉంటే చక్కెర స్థాయిలు మ్యాజిక్ వేసినట్టు కంట్రోల్ లో ఉంటాయి.  తిప్పతీగ..  రక్తంలో చక్కెరను నియంత్రించడానికి,  మధుమేహం  సమస్యలను నివారించడానికి, ఆయుర్వేదంలో తిప్పతీగ ను సూచించారు.  ఇది  రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నేరేడు.. నేరేడు పండు కూడా మధుమేహం సమస్యలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో నేరేడు విత్తనాల పొడి, నేరేడు పండ్లు కూడా   మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో,  డయాబెటిక్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడే  ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్,  పాలీఫెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఉసిరికాయ.. ఉసిరి  శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. విటమిన్-సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు ఉసిరికాయ తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.  ఇందులో యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉన్నాయి, ఇది ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచడంలో,  ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మధుమేహంలో కనిపించే ఆక్సీకరణ ఒత్తిడి,  వాపును తగ్గించడంలో  కూడా సహాయపడుతుంది.   కాకరకాయ.. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తీసుకోవలసిన కూరగాయలలో కాకరకాయ తప్పనిసరిగా ఉంటుంది. చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాకరకాయలో చేదు గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడంలో,  ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది. కాకరకాయ రసం లేదా దాని గింజల పొడిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి                             *నిశ్శబ్ద.

read more
మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు అలవాట్లు మానేయాల్సిందే...

మెదడు మన మొత్తం శరీరానికి నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది మానసిక, శారీరక  ఆలోచనలు, వాటి పరిస్థితులను,  భావోద్వేగాలను నియంత్రిస్తుంది.  మనం చదువుతున్నా, తింటున్నా, ఏదైనా చెప్పాలని అనుకున్నా, కోపం, సంతోషం, బాధ వంటివి ఎక్స్ఫెస్ చేసినా అవన్నీ మెదడు ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. దీని ద్వారా అర్థం చేసుకోవాల్సిందేమిటంటే మెదడు అనేది చాలా కీలకమైన అంశం. మెదడు ఆరోగ్యంగా లేకపోతే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంలోకి చాలా సులువుగా జారిపోతుంది. కాబట్టి మనిషి మెదడు ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. కానీ రోజువారీ అలవాట్లలో కొన్ని మనిషి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.  వీటిలో కూడా నాలుగు అలవాట్లు  మెదడు మీద ఒత్తిడి పెంచి దాని సామర్థ్యం కోల్పోయోలా చేస్తాయి. ఆ నాలుగు అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం చాలా మంచింది. జీవనశైలి, పర్యావరణ కారకాలు,  కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదం కాలక్రమేణా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం,  నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూలై 22న వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి దూరం పెట్టాల్సిన నాలుగు అలవాట్లు తెలుసుకుంటే.. ధూమపానం.. ధూమపానం అనేది మెదడుకు మాత్రమే కాకుండా  మొత్తం శరీరానికి అత్యంత హానికరమైన అలవాట్లలో ఒకటి.  ధూమపానం చేసే అలవాటున్న వ్యక్తులకు సాధారణ  వ్యక్తుల  మెదడు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది.  దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది, ఇది స్ట్రోక్,  అభిజ్ఞా క్షీణతకు దారితీస్తుంది. మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండటానికి,  మెదడు సరిగ్గా పనిచేయడానికి, మీరు ఈ అలవాటును వెంటనే వదిలివేయాలి. తగినంత నిద్ర లేకపోవడం.. మన మెదడుకు అత్యంత ప్రమాదకరంగా భావించే అలవాట్లలో, నిద్రలేమి సమస్య కూడా ప్రముఖమైనది. తగినంత నిద్ర లేకపోవడం  మెదడుకు అనేక రకాల సమస్యలను పెంచుతుంది. తగినంత నిద్ర లేనప్పుడు, మెదడుకు అవసరమైన విశ్రాంతి లభించదు. ఇది అభిజ్ఞా క్షీణత, జ్ఞాపకశక్తి కోల్పోవడం,  మానసిక స్థితి మార్పులు వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.  నిద్ర లేకపోవడం వల్ల డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.  ఒంటరితనం.. చాలా మందికి ఒంటరిగా ఉండటం ఇష్టం. ఒంటరిగా ఉండటం, ఎవరినైనా కలవడానికి, ఎవరితో అయినా మాట్లాడటానికి అసక్తి చూపకపోవడం వంటి అలవాట్లు ఉంటే వారికి   నిరాశ, అల్జీమర్స్  వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.  ఒంటరితనం  కాలక్రమేణా  మేధో సామర్థ్యాలలో క్షీణతకు కారణమవుతుంది. ఒంటరితనం ఉన్నవారి మెదడు పనితీరు  సాధారణ వ్యక్తుల కంటే చాలా తొందరగా సామర్థ్యాన్ని కోల్పోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అతిగా కూర్చోవడం.. నేటి జీవన శైలిలో ఎక్కువగా కూర్చునే ఉండటం కామన్ అయిపోయింది. ఒకే చోట గంటలు గంటలు కూర్చోవడం, కదలకుండా పనిచేసుకోవడం, ఉద్యోగాలు చేయడం మొదలయినవి  శరీరానికి హానికరం. ఇది  మెదడుపై  దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఎక్కువసేపు  కూర్చోవడం వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన  మెదడులోని ముఖ్యమైన భాగం దెబ్బతింటుంది.  తక్కువ చురుకుగా ఉన్నవారికి మెదడు వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                                    *నిశ్శబ్ద.

read more
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణానికి పెనుముప్పు!

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. కాలేయం యొక్క ప్రధాన విధి రక్తంలో రసాయన స్థాయిలను నియంత్రించడం, అలాగే బైల్ అనే ముఖ్యమైన జీర్ణ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం. అంతే కాకుండా రక్తాన్ని శుభ్రపరిచే పని, గ్లైకోజెన్ అనే చక్కెర రూపంలో శక్తిని నిల్వ చేసే పని కూడా కాలేయం ద్వారానే జరుగుతుంది. ఇంత ముఖ్యమైన భాగం దెబ్బతింటే  అప్పుడు శరీరంలో జరిగేదేంటో ఊహించండి? కాలేయం దెబ్బతింటే అది క్రమంగా మనిషి మరణానికి కారణమవుతుంది. దాని లక్షణాలను సకాలంలో గుర్తించి వాటి చికిత్స ప్రారంభించినట్లయితే, కాలేయం పూర్తీ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది ఏ సంకేతాల ఆధారంగా గుర్తించబడుతుందో, లివర్ తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుంటే.. చాలా మంది దగ్గర లివర్ పెయిల్యూర్ అనే మాట వింటూ ఉంటాం. లివర్ ఫెయిల్యూర్ అంటే అది తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవడమే. ఇది చాలాప్రమాదకరమైన పరిస్థితి, అంటే రోగికి తక్షణ వైద్య సహాయం అవసరం అవుతుంది.  లివర్ పాడైనప్పుడు  కొన్ని లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తించవచ్చు, వాటికి అనుగుణంగా నివారణ పద్ధతులను ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. కాలేయం దెబ్బతినే అవకాశం ఉన్న వ్యక్తులలో రక్తం వాంతులు, అలసట, కామెర్లు,  నిరంతర బరువు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.   ఈ సమస్యల వల్ల కాలేయం దెబ్బతింటుంది..  సాధారణంగా హెపటైటిస్‌ బి, లివర్‌ సిర్రోసిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారిలో కాలేయం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, మద్యం లేదా కొన్ని మందులు అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం పాడైపోతుంది . నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలేయం దెబ్బతినే సమస్య అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కాలేయం బలహీనంగా మారడంతో పరిస్థితి తీవ్రంగా మారుతుంది.  దీన్ని ఎలా నివారించాలంటే.. కాలేయ వ్యాధి ఉన్నవారు లేదా కాలేయం దెబ్బతినే లక్షణాలను కలిగున్న వ్యక్తులు మొదట ఆల్కహాల్ తీసుకోవద్దని  వైద్యులు  సలహా ఇస్తున్నారు. ఇది కాకుండా అధిక రక్తపోటు,  మధుమేహాన్ని నియంత్రణలో ఉంటుకోవాలి సలహా ఇస్తారు.  ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడంతో పాటు ఎర్రమాంసం, చీజ్ మరియు గుడ్లు తీసుకోవడం తగ్గించుకోవాలి.                                     ◆నిశ్శబ్ద.

read more
వర్షాకాలంలో వచ్చే దురదలు.. దద్దుర్లకు చక్కని చిట్కాలు ఇవిగో..

వర్షాకాలంలో  అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. దోమలు విజృంభించడం వల్ల  అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు వర్షాకాలంలోనే మొదలవుతాయి. ఈ సీజన్‌లో స్కిన్ అలర్జీలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు సర్వసాధారణం. ఉష్ణోగ్రత, గాలి నాణ్యత, ధూళి,  తేమ కారణంగా వర్షాకాలంలో మెడ, మోచేతులు, చేతులు, రొమ్ము కింద, గజ్జ చర్మం మొదలైన ప్రాంతాల్లో చెమట ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా, బ్యాక్టీరియా,  వైరస్లు పుడతాయి. ఇది   అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంటర్‌ట్రిగో, రింగ్‌వార్మ్, తామర, చర్మపు దద్దుర్లు, గొంతు నొప్పి, తామర, జలుబు,  జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచుతుంది.  చర్మంలో తేమ కారణంగా చెమట పట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాపించి దురద మొదలవుతుంది. ఇది మాత్రమే కాకుండా దోమలు కుట్టడం, వర్షం కారణంగా కొన్ని పురుగులు స్వేచ్చగా సంచరిస్తూ కుట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది చర్మం దురద, లేదా రాషేష్ కు కారణం అవుతుంది. ఇలాంటి  పరిస్థితిలో వర్షాకాలంలో దురద  దద్దుర్లు  తగ్గడానికి ఇంటి  చిట్కాలను  అనుసరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.  ఈ నాలుగు పదార్థాలు ఉపయోగించడం ద్వారా దద్దుర్లు తగ్గించుకోవచ్చు.  గంధపు పేస్ట్.. వర్షాకాలంలో చర్మంపై దురద ఎక్కువగా ఉంటే, అప్పుడు గంధపు పేస్ట్ చర్మానికి బాగా పనిచేస్తుంది. చందనం చర్మానికి మేలు చేస్తుందని ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్యాలలో పేర్కొన్నారు. కాబట్టి నేరుగా గంధం చెక్కనుండి  తీసిన పేస్ట్ లేదా మార్కెట్ లో లభించే గంధం పొడి ఉపయోగించవచ్చు. కొద్దిగా రోజ్ వాటర్ ను ఉపయోగించి గంధం  పేస్టు తయారుచేసుకోవాలి. దీన్ని  దురద ఉన్న చోట అప్లై చేయాలి. రెగ్యులర్ ఇల్ అప్లై  చేస్తుంటే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. పనిలో పనిగా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. కొబ్బరి నూనె కొబ్బరి నూనె చర్మానికి తేమను అందించడంతో పాటు ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. వర్షాకాలంలో దురద వస్తే కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంలో రాస్తే దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. ముందే చర్మానికి రాసుకుంటూ ఉంటే దద్దుర్లు, దురదలు రావు. నిమ్మకాయ, బేకింగ్ సోడా.. నిమ్మకాయ చర్మానికి మేలు చేస్తుంది. వర్షంలో చర్మంపై తేమ వల్ల దురద వస్తే రెండు చెంచాల బేకింగ్ సోడా, ఒక చెంచా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత చర్మాన్ని కడగాలి. దీన్ని రోజుకు ఒకసారి చేయడం వల్ల దురద నుండి బయటపడవచ్చు. వేప.. వేప చాలా ప్రయోజనకరమైన ఆయుర్వేద ఔషధం. చర్మ సంబంధిత సమస్యలలో వేపను ఉపయోగించడం మేలు చేస్తుంది. దురద సమస్య తొలగిపోవాలంటే వేప ఆకులను మెత్తగా చేసి చర్మానికి రాసుకోవాలి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి.                                  *నిశ్శబ్ద.

read more
వర్షాకాలం ఆరోగ్య సూత్రాలు

వర్షాకాలం వచ్చేసింది. వర్షాలతో పాటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1. వర్షాకాలంలో తగినంత నీరు త్రాగాలి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ శరీరానికి నీరు అవసరం. వర్షం వల్ల వచ్చే అధిక తేమ కారణంగా డీహైడ్రేట్‌కు కారణం అవుతుంది. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండవచ్చు . 2. వర్షాకాలంలో అల్లం, హెర్బల్ టీలు, సూప్‌లు తాగాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టీ, హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 3. సీజన్‌లో లభించే పండ్లను తినాలి. యాపిల్స్, బేరి, దానిమ్మ, నారింజ పళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లను నిరోధిస్తాయి. 4. రోగనిరోధక శక్తి ని బలోపేతం చేయడానికి ఆహారంలో విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినాలి. నిమ్మకాయలు, నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బ్రకోలీ, బెల్ పెప్పర్స్, కివీస్‌లో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి కాపాడుతాయి. 5. వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. చికెన్, చేపలు, వంటి లీన్ ప్రోటీన్స్ ద్వారా కండరాలు పెరుగుతాయి. కూరగాయలలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 6. వెల్లుల్లి, ఉల్లిపాయలు సహజంగా యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి రక్షిస్తాయి. వర్షాకాలంలో బయటి ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా బయటి ఫుడ్స్‌ మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అలాగే శీతల పానీయాలు కూడ మానేస్తే మానేస్తే మంచిది . లేదంటే జలుబు చేసే అవకాశాలు ఉన్నాయి.

read more
డెంగీ జ్వరంలో ప్లేట్ లెట్స్ ఎందుకు తగ్గుతాయి?

వర్షాకాలంలో దోమలు విజృంభించడం వల్ల  వచ్చే జ్వరాలలో డెంగీ ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైనది. సరైన ట్రీట్మెంట్ లేకపోవడం డెంగీ జ్వరాన్ని ప్రాణాంతకంగా మారుస్తుంది. డెంగీ వచ్చినవారిలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోతుందనే విషయం  అందరూ వినే ఉంటారు. ఇలా ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం  మరణానికి తలుపులు తెరవడమే.. అసలు ఈ ప్లేట్ లెట్స్ ఎందుకు తగ్గిపోతాయి? దీనికి  కారణం ఏంటి? ప్లేట్ లెట్స్ పెంచడానికి ఏం చేయాలి? మొదలైన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్లేట్ లెట్స్  ఎంత ఉండాలి? ప్లేట్‌లెట్స్, లేదా థ్రోంబోసైట్‌లు, మన రక్తంలోని  రంగులేని, చిన్న  కణ శకలాలు. ఇవి గాయం తగిలినప్పుడు రక్తస్రావం అయ్యేటప్పుడు రక్తం గడ్డ  కట్టేలా చేస్తాయి. ఈ కారణంగా రక్తస్రావాన్ని ఆపుతాయి. ఈ ప్లేట్ లెట్స్  ఎముక మజ్జలో  తయారవుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తిలో ప్లేట్‌లెట్ కౌంట్ మైక్రోలీటర్ రక్తంలో 1,50,000 నుండి 4,50,000  వరకు ఉంటుంది. 450,000 కంటే ఎక్కువ ప్లేట్‌లెట్‌లను కలిగి ఉండటాన్ని థ్రోంబోసైటోసిస్ అని,  150,000 కంటే తక్కువ ప్లేట్‌లెట్లను థ్రోంబోసైటోపెనియా అని పిలుస్తారు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి థ్రోంబోసైటోపెనియా అనే సమస్య  శరీరంలో ఏర్పడుతుంది. ప్లేట్ లెట్స్ తగ్గడానికి ఇదే కారణం.. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మన ఎముక మజ్జ అణచివేయబడుతుంది, ఫలితంగా ప్లేట్‌లెట్ ఉత్పత్తి తగ్గుతుంది. డెంగ్యూ వైరస్ బారిన పడిన రక్తకణాలు ప్లేట్‌లెట్లను దెబ్బతీసి వాటిని నాశనం చేయడం ప్రారంభిస్తాయి. డెంగీ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఏర్పడే  యాంటీబాడీల వల్ల ప్లేట్‌లెట్స్ కూడా తగ్గడం ప్రారంభిస్తాయి. ప్లేట్ లెట్స్ తగ్గితే శరీరంలో జరిగేది ఇదే.. డెంగ్యూ వ్యాధి వచ్చిన 3వ-4వ రోజు వరకు ప్లేట్‌లెట్ కౌంట్ సాధారణంగా తక్కువగా ఉంటుంది.  ఆ తరువాత జరిగే ట్రీట్మెంట్ వల్ల ఎనిమిది నుండి తొమ్మిదవ రోజులో మెరుగుదల  ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి డెంగ్యూ  జ్వరం వచ్చినప్పుడు మొదటి  8రోజులు చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి.  ప్లేట్‌లెట్స్ రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి కాబట్టి, శరీరంలో వాటి లోపం వల్ల డెంగ్యూ కేసుల్లో రక్తపు వాంతులు లేదా రక్తపు మలం జరుగుతుంది. ప్లేట్‌లెట్స్  ఎలా పెంచుకోవాలి? డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్స్ తగ్గడం తీవ్రమైన వ్యాధికి సంకేతం. రోగిని ఆసుపత్రిలో చేర్చాలి, తద్వారా ఇతర లక్షణాలతో పాటు రక్తస్రావం సమస్యను నియంత్రించవచ్చు. వైద్యులు దానిని మందుల ద్వారా మెరుగుపరుస్తారు. ఇది కాకుండా, ఒమేగా -3, విటమిన్లు, ఐరన్ మరియు ఇతర మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడతాయి, డెంగ్యూలో ప్లేట్‌లెట్ల సంఖ్యను కూడా పెంచుతాయి. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.   *నిశ్సబ్ద.

read more
ఏ జ్వరం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయంటే...

వర్షాకాలంలో  దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. భారీ వర్షాలు, నీరు నిలిచిపోవడం, వరదలు, నీరు కలుషితమవడం వంటివి  దోమల సంతానోత్పత్తికి అత్యంత అనుకూలమైనవి, అందుకే డెంగ్యూ-మలేరియా,  చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రభలుతాయి. వీటి బాధితుల సంఖ్య వర్షాకాలంలో,  ఆ తర్వాత కొన్ని నెలల వరకు కూడా  నమోదవుతుంది. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా  జ్వరాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఓ దశ దాటితే ప్రణాలను చాలా సులువుగా లాగేసుకుంటాయి. ఈ వ్యాధుల కారణంగా ఏటా వందల మంది మరణిస్తున్నారు. అందుకే ఈ వ్యాధుల తీవ్రతను అర్థం చేసుకోవడం, వీటి నివారణ చర్యలపై శ్రద్ధ వహించడం అవసరం. డెంగ్య, మలేరియా, చికున్‌గున్యా వీటి  మధ్య తేడాను ఎలా గుర్తించాలంటే.. డెంగ్యూ.. డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ (DENV) వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ సోకిన దోమలు పగటిపూట ఎక్కువగా కుడతాయి, అందుకే  వర్షాకాలంలో  ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించడం మంచిది. తేలికపాటి డెంగ్యూలో అధిక జ్వరం,  ఫ్లూ-వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే  డెంగ్యూ తీవ్రరూపం దాలిస్తే అది  హెమరేజిక్ జ్వరానికి దారితీస్తుంది, ఇది తీవ్రమైన రక్తస్రావం, రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం, షాక్ కు లోనవడం, తద్వారా  మరణానికి కూడా దారి తీస్తుంది. డెంగ్యూ జ్వరంలో బ్లడ్ ప్లేట్‌లెట్స్ చాలా వేగంగా తగ్గడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ సోకిన వ్యక్తి దగ్గర ఉండటం వల్ల మీకు డెంగ్యూ జ్వరం రాదు. దీని నివారణకు దోమలు వృద్ధి చెందకుండా, కుట్టకుండా చర్యలు తీసుకోవాలి. మలేరియా.. డెంగ్యూ మాదిరిగానే మలేరియా కూడా తీవ్రమైన వ్యాధి. మలేరియా అనేది పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధి. ఈ పరాన్నజీవులు సోకిన దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తాయి. మలేరియా ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక జ్వరం, చలి ని అనుభవిస్తారు. మలేరియా కూడా తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. మలేరియా వల్ల ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ వ్యాధి  కిడ్నీకాలేయం ను  కూడా దెబ్బతీస్తుంది. మలేరియాను మందులతో నయం చేయవచ్చు. చికున్‌గున్యా .. చికున్‌గున్యా అనేది చికున్‌గున్యా వైరస్ (CHIKV) వల్ల దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఈ వ్యాధి  మొదటి లక్షణాలు సాధారణంగా జ్వరం,  చర్మపు దద్దుర్లు రూపంలో కనిపిస్తాయి. ఇది కాకుండా, రోగులకు అకస్మాత్తుగా అధిక జ్వరం (సాధారణంగా 102°F పైన), కీళ్ల నొప్పులు, తలనొప్పి, వికారం,  వాంతులు కూడా ఉండవచ్చు. చికున్‌గున్యాకు నిర్దిష్ట యాంటీవైరల్ మందు లేదు, కాబట్టి చికిత్స లక్షణాలను తగ్గించడానికి,  సమస్యలను నివారించడానికి ప్రయత్నిస్తారు. దీని చికిత్సలో  రోగి పుష్కలంగా ద్రవాలు త్రాగుతూ  ,  విశ్రాంతి బాగా తీసుకోవాలి. నివారణ ఎలాగంటే.. దోమల వల్ల వచ్చే వ్యాధులన్నింటిని అరికట్టాలంటే దోమ కాటును నివారించే పద్ధతులను అవలంబించడం ఉత్తమమైన మార్గమని వైద్యులు చెబుతున్నారు. పొడవాటి చేతుల బట్టలు ధరించాలి. రాత్రి పడుకునేటప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచి, దోమతెరలు వాడాలి. దోమల వికర్షక కాయిల్స్ అనేక విధాలుగా హానికరం అని కనుగొనబడింది, కాబట్టి వాటిని చాలా తక్కువగా వాడాలి. దోమల నివారణకు సహజ మార్గాలు ఫాలో అవ్వాలి.                                                          *నిశ్శబ్ద.

read more
అలర్జిక్ వ్యాధుల గురించి నమ్మలేని నిజాలు!!

శ్వాసకోశ వ్యవస్థలోని వివిధ భాగాలు అలర్జీ వ్యాధికి గురవటం చూస్తున్నాము. అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, బ్రాంయల్ అస్తమా వంటి వ్యాధులు ఈ కోవకు చెందుతాయి. అలర్జీ అంటే మితిమీరిన సున్నితత్వం అని చెప్పవచ్చు. కొన్ని హానికరంకాని పదార్థాలకు, వాతావరణానికి శరీరం అతి సున్నితంగా స్పందించడమే. ఏ పదార్థానికైతే రోగి సున్నితత్వం కలిగి ఉంటాడో ఆ పదార్థాన్ని అలెర్జిన్ అంటాము. ఈ పదార్థాలు ఇతర ఆరోగ్యవంతులు తీసుకున్నా, ఎక్స్పోజ్ అయినా, ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కాని అలా ఉన్నవాళ్ళు ఈ అలెర్జెన్స్ ని తీసుకున్నట్లయితే దేహరక్షణ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. దీనినే అలర్జిక్ రియాక్షన్ అంటాము.  ఇది గాలిలో పుప్పొడి, దుమ్ము . ధూళి, తినే పదార్థాలలోగాని, పాలు, చేపలు, గుడ్లు, పులుపు, పండ్లు మొదలయి వాటికి దేనికైనా ఈ అలర్జీ రోగులు రియాక్ట్ కావచ్చు. ఆరోగ్య వంతులు ఈ పదార్థాలను సులభంగా శరీరంలో ఇముడ్చుకుంటారు. దేహరక్షణ వ్యవస్థ ఈ పదార్థాలను దేహానికి శత్రువులుగా భావించటం వల్ల రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ చర్మం పైకాని, జీర్ణనాళంలో కాని, శ్వాసమండలంలో కాని జరగవచ్చు. శ్వాసమండలంలో ఈ అలర్జీ రియాక్షన్ ఏర్పడటం వల్ల రైనైటిస్, అలర్జిక్ బ్రాంకై టెస్, బ్రాం యల్ ఆస్తమావంటి వ్యాధులు వస్తాయి. అలర్జీక్ రియాక్షన్ తినే పదార్థాలనుండే కాకుండా ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల వల్ల కూడా వస్తుంది. కొంతమంది అధిక తేమవల్ల, కొంతమంది చల్లదనం వల్ల, కొంతమంది వాతావరణంలో మార్పులకు కూడా స్పందిస్తారు. వేడి నుండి మేఘాలతో కూడిన తేమ వాతావరణం, మరికొంతమంది వాతావరణం లోని విద్యుత్ మార్పులకు కూడా స్పందించటం జరుగుతుంది. ఆరోగ్యవంతులు ఈ వాతావరణ పరిస్థితులకు సులభంగా తట్టుకోగలరు. అలర్జీ రోగుల్లో వ్యాధినిరోధక శక్తిలో సమతుల్యం లోపించటం వల్లనే ఈ విధంగా అతిగా రియాక్ట్ అవుతారు.  సాంప్రదాయ వైద్య విధానంలో రోగి ఏ పదార్థాలకు సున్నితంగా ఉన్నాడో, ఆ పదార్థాన్ని డైల్యూట్ చేసి అతిసూక్ష్మ పరిమాణంలో కొంతకాలం రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనినే డిసిన్సిలైజేషన్ అంటారు. అంటే రోగి ఉన్న అతి సున్నితత్వం ఆ పదార్థం నుండి తగ్గిపోతుంది. ఈ పద్ధతి వల్ల రోగి రియాక్ట్ అవటం కొంత తగ్గుతుంది. కాని ఈ రకమైన డిసెన్సిటైనేషన్ వల్ల కూడా ఉపశమం తాత్కాలికమే. కొంతకాలం తర్వాత రోగి ఇంకో పదార్థానికి సున్నితత్వం పెరుగుతుంది. అలర్జిన్ మారిపోతుంది కాని సమస్య పరిష్కారం అవటంలేదు.  ఆహార పదార్థాలకు, దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి పదార్థాలకు డిసిన్సిటైజేషన్ ప్రయత్నించవచ్చు. కాని, చల్లదనం, వేడి, వాతావరణంలో మార్పులకు సున్నితత్వాన్ని మా తం ఈ ప్రక్రియ ద్వారా ఏమి చేయలేరు. ఈ అలర్జిక్ వ్యాధులు దీర్ఘవ్యాధులు. అపుడపుడు వ్యాధి ఉద్రేకిస్తుంది. దీనిని అక్యూట్ అటాక్ అంటాము. అక్యూట్ అటాక్ తగ్గటానికి అక్యూట్ మందులు వాడినా, వెంటనే రోగ లక్షణాలు తక్కువవుతాయి. కాని రోగం నిగూఢంగా ఉంటుంది. తగిన పరిస్థితులు ఏర్పడినపుడు ఈ వ్యాధి మళ్లీ దర్శనమిస్తుంది. అలర్జిక్ వ్యాధులను సమూలంగా నయం చేయటానికి సమయం పడుతుంది. అలర్జిక్ వైనైటిస్లో 1-3 సంవత్సరాలు, ఆస్తమాలో 2 నుండి 6 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి తీవ్రత, అక్యూట్ అటాక్స్ తరచుదనం, క్రమంగా తగ్గిపోతాయి. చికిత్స ప్రారంభ దశలో రోగి తనకు పడని ఆహార పదార్థాలకు, వాతావరణ పరిస్థితులకు దూరంగా ఉండడం మంచిది. చర్మానికి సంబంధించిన అలర్జిక్ వ్యాధులను పై పూతతో వ్యాధిని అణచివేయటం వల్ల రెస్పిరేటరీ అలర్జీ వచ్చే అవకాశం వుంది. ఇదీ అలర్జీక్ వ్యాధుల తీరూ… తెన్ను.                                       ◆నిశ్శబ్ద.

read more
చేతులు కాళ్ళు వణుకుతున్నాయా... అయితే మీకూ ఈ ప్రమాదం ఉండొచ్చు!

చాలా మందికి కూర్చున్నప్పుడు  చేతులు లేదా కాళ్లు తరచుగా వేగంగా వణుకుతుంటాయి.  శరీరాన్ని సక్రమంగా  నియంత్రించడంలో  సమస్య ఏర్పడుతుంటుంది. ఈ లక్షణాలు ఉంటే మాత్రం దాన్ని లైట్ గా తీసుకోవడానికి లేదు. ఈ లక్షణాలు నాడీ వ్యవస్థకు సంబంధించినవిగా పరిగణిస్తారు. దీన్ని చాలా ప్రమాదకరమైన  పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలుగా కూడా చెబుతారు.  కదలికను నియంత్రించే మెదడులోని నాడీ కణాలలో సమస్య కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో నరాల కణాలు చనిపోయిపోతాయి  లేదా క్షీణిస్తాయి. ఇది డోపమైన్ అనే ముఖ్యమైన రసాయనాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. డోపమైన్  అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాలలో 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ నష్టం కలిగిన వారిలో  పార్కిన్సన్ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.  మనిషిలో సంతోషాన్ని కలిగించే న్యూరోట్రాన్స్మిటర్లలో డోపమైన్ ఒకటి. పార్కిన్సన్స్ వ్యాధి.. ప్రతి సంవత్సరం 60,000 కొత్త పార్కిన్సన్స్ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితి సాధారణంగా 55 ఏళ్ల తర్వాత వస్తుంది.  అయితే ఇది 30-40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి   మెదడులో ఉండే అత్యంత సాధారణమైన మోటార్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు, దాని లక్షణాలు కూడా పెరుగుతాయి. వ్యాధి  తరువాతి దశలలో  మెదడు పనితీరు తరచుగా ప్రభావితమవుతుంది, ఇది చిత్తవైకల్యం వంటి లక్షణాలు, ఇంకా నిరాశకు దారితీస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి  లక్షణాలు.. పార్కిన్సన్స్ వ్యాధి శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో అవయవాలు,  దవడ  వణుకు లేదా అసంకల్పిత కదలిక ఉంటాయి. ఈ లక్షణాలలో అత్యంత సాధారణమైనవి కండరాల దృఢత్వం, భుజాలు లేదా మెడలో నొప్పి రావడం. మానసిక పరిస్థితిలో మార్పు లేదా స్పందించే  సమయం తగ్గుతుంది.  కనురెప్పలు ఆర్పే వేగం తగ్గుతుంది.  నడకలో  స్థిరత్వం ఉండదు.  డిప్రెషన్ లేదా డిమెన్షియా ప్రమాదం ఉంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి ఎవరికి వస్తుంది?  కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు ఈ సమస్య ఉంటే, ఆ కుటుంబ సభ్యులు  కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది. అదనంగా, పార్కిన్సన్స్ వ్యాధిని మహిళల కంటే పురుషులలోనే  ఎక్కువగా వస్తుంది. టాక్సిన్స్ ఎక్కువగా ఉండే వ్యక్తులు కూడా దీని బారిన తొందరహా పడతారు. పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స,  నివారణ ఈ వ్యాధి ఉన్న రోగుల పరిస్థితి, దాని లక్షణాలను బట్టి ఈ వ్యాధి నియంత్రించడానికి  మందులు,  చికిత్స ఉంటుంది. దీని ద్వారా నాణ్యమైన జీవినశైలి అందించడానికి   ప్రయత్నాలు చేస్తారు. పార్కిన్సన్స్ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల లేదా యాదృచ్ఛికంగా కూడా సంభవిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. అయినప్పటికీ, క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం ద్వారా  పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదాన్ని  తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.                                                               *నిశ్శబ్ద.  

read more
లిఫ్ట్ ఎక్కడం మాని మెట్లమీద వెళితే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా!

ఇప్పట్లో ఆఫీసులు, ఇళ్లు అన్నీ బిల్డింగ్ లలోనే ఉంటున్నాయి. ఈ కారణంగా లిఫ్ట్ లు తప్పనిసరిగా వాడుతుంటారు. లిఫ్ట్ సౌకర్యం ఉందిగా.. మళ్ళీ మెట్లు ఎక్కి ఎందుకు శ్రమ పడాలి?? అనుకుంటారు ఎక్కువ శాతం మంది. అయితే ఆఫీసుల్లో గంటల కొద్ది కూర్చుని చేసే ఉద్యోగం, ఆ తరువాత ఇళ్ళల్లో కూడా మరీ శారీరక శ్రమ ఏమీ లేకుండా సింపుల్ గా పనులు జరిగిపోయే మార్గాలు ఉండటంతో శారీరక శ్రమ తక్కువగానే ఉంటుంది. అయితే ఇలా బిల్డింగ్ లలో లిఫ్ట్ లో వెళ్ళడం మానేసి మెట్లు ఎక్కితే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా??  లిఫ్ట్‌కి బదులుగా మెట్లను ఉపయోగిస్తే.. రోజువారీ పనుల్లో వేగం కారణంగా లిఫ్ట్ ఎక్కువగా వాడుతారు. ఇది సమయాన్ని సేవ్ చేస్తుంది. కానీ ఈ అలవాటు మానుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. రొటీన్‌లో ఈ చిన్న మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ఒక మెట్లు ఎక్కడం వల్ల సాధారణంగా నాలుగు అడుగులు నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి అయ్యి కేలరీలు దీనివల్ల ఖర్చు అవుతాయి.  రోజూ కనీసం 50 మెట్లు ఎక్కితే 2000 అడుగులు నడిచినంత ఫలితం చేకూరుతుంది. ఇప్పట్లో  ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి ఫిట్నెస్ తక్కువగానే ఉంటోంది . ఇలాంటి వాళ్లకు లైఫ్ స్టైల్ లో భాగమైన ఆఫీసులు, అపార్ట్మెంట్లకు వెళ్ళడం అనేది మంచి అనువైన మార్గం. వ శారీరక దుష్ప్రభావాలను తగ్గించడంలో  క్యాలరీలను బర్న్ చేయడంలో మెట్లు ఎక్కే ప్రక్రియ చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది.   బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?  మెట్ల ఎక్కడం అనేది గుండె మరియు శ్వాసకోశ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అద్భుతమైన వ్యాయామం.   మెట్లు ఎక్కేటప్పుడు ఫాలో అయ్యే విధానం కూడా దానికి తగిన ఫలితాలను ఇస్తుంది.   మెట్లపై నడవడం కంటే జాగింగ్ లాగా నెమ్మదిగా పరుగెడుతున్నట్టు వెళితే అదొక మంచి ఏరోబిక్ వ్యాయామంలా కూడా పనిచేస్తుంది. ఏరోబిక్ వ్యాయామాలు శరీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి.  రొటీన్‌ లైఫ్ స్టైల్ లో ఈ ఒక్క మార్పు చేసుకుంటే చాలు.. చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవడం వల్ల, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరం మీద కలిగే దుష్ప్రభావాలు తగ్గడమే కాకుండా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.  గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొన్ని ఆసక్తికర విషయాలు..   రోజుకు 55 కంటే ఎక్కువ మెట్లు ఎక్కడం  వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని,  మరణ రేటును  తగ్గిస్తుంది. నిమిషం పాటు నాన్ స్టాప్ గా మెట్లు ఎక్కితే.. 8-11 కిలో కేలరీలు బర్న్ అవుతాయి, ఇది ఇతర  శారీరక శ్రమతో పోలిస్తే చాలా ఎక్కువ. మెట్లు ఎక్కేవారు సాధారణ వ్యాయామం చేసేవారికంటే మరింత ఫిట్‌గా ఉంటారు.   ఏరోబిక్ సామర్థ్యం పెరుగుతుంది. రోజుకు 20 మెట్లు ఎక్కినా చాలా సులువుగా ఏడాదికి 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో  ఎముకలు బలంగా మారడానికి ఇది సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి ఇది  సహాయపడుతుంది.  ఎముకలు, కండరాలు మరియు కీళ్ల ఆరోగ్యానికి మెట్లు ఎక్కడమనే ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు నుండే మీ లిఫ్ట్ బటన్ నుండి దూరం జరిగి మెట్లు ఎక్కడాన్ని ఎంజాయ్ చేయండి..                                    *నిశ్శబ్ద.

read more
విటమిన్ హెచ్ గురించి ఎంతమందికి తెలుసు? ఇది లోపిస్తే ఏకంగా ప్రాణాలే పోతాయి.. 

విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12 ఇలా చాలా విటమిన్ల  పేర్లు తప్పక వినే ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ పోషకాహారం చాలా ముఖ్యం. కానీ విటమిన్-హెచ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?? అసలు విటమిన్ల గురించి మీకు ఎంత తెలుసు?? ఈ విటమిన్ హెచ్ లోపిస్తే జబ్బులు రావడం, శరీర పనితీరు దెబ్బతినడం కాదు, ఏకంగా ప్రాణాలే పైకి పోతాయట. ఈ విటమిన్ హెచ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే.. విటమిన్ హెచ్ అంటే.. విటమిన్ B7 ని విటమిన్ H అని కూడా అంటారు. జుట్టు,  చర్మానికి ఇది చాలా ముఖ్యమైన పోషణ. బయోటిన్ ఏ విటమిన్ b7, ఈ విటమిన్ బి7 ఏ విటమిన్ హెచ్.  ఇది లోపిస్తే.. విటమిన్ హెచ్ లేదా బయోటిన్ లోపం వల్ల బట్టతల, దద్దుర్లు, కండ్లకలక, కీటోలాక్టిక్ అసిడోసిస్, అసిడ్యూరియా, చర్మ వ్యాధులు, అలసట  ఇలా  మరెన్నో సమస్యలకు కారణమవుతుంది. విటమిన్ హెచ్ లోపం వల్ల కొన్ని అమైనో ఆమ్లాలు సరిగా జీర్ణం కావు. దీని కారణంగా రక్తం,  మూత్రంలో ప్రమాదకరమైన పదార్థాలు పెరగడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా, మూత్రంలో నురుగు ఏర్పడటం ప్రారంభమవుతుంది. విటమిన్ హెచ్ ఎందులో ఉంటుందంటే.. గుడ్లలో బయోటిన్ ఉంటుంది, ఇది విటమిన్ హెచ్ లోపాన్ని నివారిస్తుంది. ఒక గుడ్డు 10 mcg బయోటిన్‌ను అందిస్తుంది. ఇది రోజువారీ అవసరాలలో భారీ భాగం. శాకాహారులు విటమిన్ హెచ్‌ని పొందడానికి బాదంపప్పును తినవచ్చు. పావు కప్పు బాదంపప్పు తినడం వల్ల 1.5 mcg బయోటిన్ లభిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, చిలగడదుంపలు, బ్రోకలీ, బచ్చలికూర, సాల్మన్ చేపలు, పాలు, అరటిపండ్లు మొదలైన వాటిని తినడం ద్వారా కూడా విటమిన్ హెచ్ లేదా బయోటిన్ పొందవచ్చు . *నిశ్శబ్ద.

read more