చల్లని,  పొడి వాతావరణంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చర్మం పై పొర నుండి తేమను త్వరగా తొలగిస్తుంది. దీని వల్ల చర్మం  పొడిగా  గరుకుగా మారుతుంది. దీని కారణంగా పగుళ్లు ఏర్పడతాయి. చలి నుండి ఉపశమనం కోసం చాలా మంది  హీటర్ వాడతారు. మరికొంత మంది  వేడి నీటి స్నానం ద్వారా ఉపశమనం పొందాలని అనుకుంటారు.  కానీ వీటి వల్ల  పొడిదనం మరింత ఎక్కువ అవుతుంది. అసలు చలికాలంలో చర్మం ఎందుకు పొడిగా మారుతుంది. చర్మం పొడిగా మారి పగుళ్లు రాకూడదంటే ఏం చేయాలి? ఏం తినాలి? తెలుసుకుంటే..

చర్మం ఎందుకు పొడిగా మారుతుందంటే..

శీతాకాలంలో గాలిలో తేమ తగ్గి చర్మం త్వరగా ఎండిపోతుంది. బయట చల్లని గాలి నుండి చర్మానికి ఉపశమనం కలిగించుకోవడం కోసం వేడికి దగ్గరగా ఉండాలని అనుకుంటారు.  ఇది చర్మంలోని తేమను తొలగిస్తాయి. ఈ సమయంలో చర్మం సహజ నూనెలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా తగ్గి, చర్మం  రక్షణ పొరను బలహీనపరుస్తుంది. వేడి నీటిలో స్నానం చేస్తే లేదా తగినంత నీరు త్రాగకపోతే పొడిబారడం మరింత పెరుగుతుంది.   బయటి వాతావరణానికి ప్రభావితమయ్యే శరీర భాగాలైన మఖం,  చేతులు, కాళ్లలో ఈ పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది.

చర్మం పొడిబారి పగుళ్లు రాకుండా చేసే ఆహారాలు..

ఆహారం చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మంలోని నూనె సమతుల్యతను కాపాడుతాయి. బాదం, వేరుశెనగలు,  పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి విటమిన్ E సమృద్దిగా ఉన్న ఆహారాలు   చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి.

క్యారెట్,  పాలకూర వంటి విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు చర్మ కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. తగినంత నీరు త్రాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండటంలో సహాయపడుతుంది.  అసమతుల్యమైన లేదా ప్రాసెస్ చేసిన ఆహారం చర్మ సహజ కాంతిని తగ్గిస్తుంది.  పొడిబారడాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే చర్మానికి మేలు చేసే ఆహారాలు తీసుకోవాలి.

                               *రూపశ్రీ.