గుడి ముందు గోపురం ఎందుకు?

 


భారతదేశం అనగానే ఆధ్మాత్మికత... ఆ ఆధ్యాత్మికతను ప్రతిబింబాలైన ఆలయాలు గుర్తుకువస్తాయి. భారతదేశమంతటా ఒకో ప్రాంతంలోని ఆలయాలు ఒకో శైలిలో ఉంటాయి. కానీ దక్షిణాదికి వచ్చేసరికి భారీ గోపురాలే ఇక్కడి ఆలయాల ప్రత్యేకతగా కనిపిస్తాయి. ఇప్పటికీ దక్షిణాది ప్రజలు గోపురాలని తమ సాంస్కృతిక వారసత్వంగా భావిస్తారు. అందుకనే తమిళనాడు రాజముద్ర మీద సైతం శ్రీవిల్లిపుత్తూరు గోపురమే దర్శనమిస్తుంది. ఇంతకీ ఈ గోపురాలు కేవలం ఆడంబరానికేనా, లేకపోతే వీటి వెనుక పెద్దలు ఆలోచించిన కారణాలు ఏమన్నా ఉన్నాయా అంటే...

 

- ఇప్పుడంటే అంతస్తులకొద్దీ ఎత్తైన భవంతులను కట్టేస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఊరంతటికీ ఎత్తైన భవనం ఆ ఊరి గోపురమే. ఒక ఊరికి వెళ్లేందుకు దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఈ గోపురాలు కనిపించేవి. అందుకేనేమో గోపురం అన్న మాటకి ‘పట్టణ ద్వారం’ అన్న అర్థం కూడా ధ్వనిస్తుంది. ఇప్పటికీ కంచికి వెళ్లే దారిలో దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచే ఆ ఊరి గోపురాలు కనిపిస్తూ ఉంటాయి.

 

- ఊరిలోనే ఎత్తైన, సురక్షితమైన భవనం కాబట్టి ప్రకృతి విపత్తులలో గోపురాన్ని మించిన ఆపన్న హస్తం ఉండదు. విపత్తులలో స్వామివారి ఆధ్యాత్మిక అభయం ఎలాగూ ఉంటుంది. ఇక భౌతిక రక్షణ కూడా వారి పాదాల చెంతనుండే గోపురం దగ్గర లభిస్తుందన్నమాట!

 

- ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే బాటసారులకి అన్నిచోటలా సత్రాల వసతి ఉండదు. కానీ గుడి లేని ఊరు మాత్రం కనిపించదు. ఆ గుడి గోపురం నీడన కాసింత సేదతీరి, చీకటివేళన బడలికను తీర్చుకుని, ఇంత ఆహారం తీసుకుని మళ్లీ బయల్దేరేవారు బాటసారులు.

 

 

- గత సహస్రాబ్ది అంతా ఏదో ఒక యుద్ధంలోనే గడిచిపోయింది. ఎప్పుడు ఎటు వైపు నుంచి శత్రుసైన్యం విరుచుకుపడుతుందో, ఏ వైపు నుంచి అల్లరి మూకలు చెలరేగుతాయో తెలియని పరిస్థితి. ఇక తరుష్కుల దండయాత్రలు, బ్రిటిషర్ల దురాక్రమణలు సరేసరి! ఇలాంటి సమయంలో ఊరి వైపుగా ఎవరన్నా శత్రువులు వస్తున్నారేమో అని గమనించే ‘వాచ్‌ టవర్లు’గా గోపురాలు ఉపయోగపడేవి.

 

- గోపురాల విషయంలో చాలామంది విశ్వసించే అంశం... పిడుగుల నుంచి రక్షణ. గోపురాల పైన ఉండే కలశాలు పిడుగుపాటుని నిర్వీర్యం చేసే ‘ఎర్త్‌’లాగా పనిచేస్తాయని చాలామంది నమ్మకం. ఊరిలో ఉండే కట్టడాలన్నింటికంటే గోపురాలే పై ఎత్తున ఉంటాయి కాబట్టి, పిడుగులని దిగమింగి ఊరిని సురక్షితంగా ఉంచుతాయంటారు. గోపుర నిర్మాణానికి వాడే సామాగ్రి కూడా పిడుగులను నిర్వీర్యం చేసేందుకే అనువుగా ఉంటుందట.

 

- భౌతికమైన విషయాలను పక్కనపెడితే... ఉన్నతమైన గోపురాలు, వాటి మీద చెక్కిన కళాఖండాలు అంతులేని ప్రశాంతతని అందిస్తాయి. భగవంతుని వైభవానికి భక్తుడు అందించే చిరుకానుకగా తోస్తాయి. గోపురం దగ్గరకి వచ్చి తల ఎత్తి చూడగానే మనసు మరో లోకంలోకి ప్రవేశించేందుకు సిద్ధపడిపోతుంది. గోపురం లోపలికి అడుగుపెట్టగానే ఆధ్మాత్మిక సామ్రాజ్యంలోకి కాలుమోపిన అనుభూతి కలుగుతుంది.

 

భౌతికంగా, ఆధ్మాత్మికంగా గోపురాలను ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే, వేయి సంవత్సరాలకు పూర్వం మొదలైన ఈ తరహా కట్టడాలను ఇప్పటికీ ఆదరిస్తున్నారు, అనుసరిస్తున్నారు.

 

- నిర్జర.


More Enduku-Emiti