పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలు,  దేవుడి పటాలు ఉండవచ్చా...

 


 ప్రతి హిందువు ఇంట్లో అది పెద్దదైనా, చిన్నదైనా దేవుని గది ఉంటుంది. దీన్ని ఇంట్లో చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ప్రతిరోజూ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే  సానుకూల శక్తి, ఇంట్లో శాంతి ఉంటాయని చెబుతారు. అయితే కాలంతో పాటు పద్దతులు మారుతున్నాయి. దేవుడి గదిలో దేవుడి పటాలు, విగ్రహాలు ఎక్కువ కనిపిస్తుంటాయి.  కొన్నిసార్లు విగ్రహాలు,  ఫోటోలు అందంగా ఉన్నాయని కొనేసి దేవుడి గదిలో పెడుతుంటారు. అయితే   కొందరు తెలిసి, తెలియక దేవుడి విగ్రహాలు,  ఫోటోల విషయంలో చేసే కొన్ని పొరపాట్లు చాలా ఇబ్బందులకు దారి తీస్తాయి.  దీని గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..

పూజ గదికి సంబంధించి ముఖ్యమైన నియమాలు..

పూజ గదిలో దేవతల విగ్రహాలు,  పటాలను ఉంచే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. సరైన రకమైన విగ్రహాలు,  వాటికి తగిన సంఖ్యను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నియమాలను ఉల్లంఘిస్తే అది కుటుంబ సభ్యుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

ఇంట్లో రెండు శివలింగాలు ఉంటే..

ఒకే ఇంట్లో రెండు శివలింగాలను ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. శివలింగ స్థలం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి.  ఒక్క శివలింగాన్ని మాత్రమే పూజించడం ఉత్తమంగా పరిగణించబడుతుందట.

మూడు వినాయక  విగ్రహాలు ఉంటే..

గణపతిని అడ్డంకులు తొలగించే దైవంగా విఘ్నేశ్వరుడిగా  భావిస్తారు.  అందుకే తొలిపూజ ఎప్పుడూ ఆయనకే అందాలి. అయితే మూడు గణపతి విగ్రహాలను ఇంట్లో ఉంచినట్లయితే అది శుభ ఫలితాలను ఇవ్వదట. ఇది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లేదా ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందని నమ్ముతారు.

రెండు శంఖాలు  ఉంటే..

శంఖం చాలా పవిత్రమైనది.  శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా బావిస్తారు.  అర్చనలు, అభిషేకాలు చేసేటప్పుడు శంఖం ఉపయోగిస్తే ఆ పూజా ఫలం మరింత పెరుగుతుంది. అలాగే పూజల సమయంలో శంఖానాదం చేయడం వల్ల దేవుడు ప్రసన్నం అవుతాడు.   కానీ ఇంట్లో రెండు శంఖాలు ఉంచడం సరికాదని భావిస్తారు.

రెండు సూర్య విగ్రహాలు ఉంటే..

సూర్య భగవానుడు  శక్తికి చిహ్నంగా పరిగణించబడతాడు.  ఈయన ప్రత్యక్ష దైవం. అయితే ఇంట్లో రెండు సూర్య విగ్రహాలు లేదా సూర్య పటాలు   ఉంచడం వల్ల అననుకూల ప్రభావాలు ఉంటాయి.

మూడు దుర్గా విగ్రహాలు  ఉంటే..

దుర్గా దేవి శక్తి స్వరూపం. కానీ ఇంట్లో మూడు దుర్గా విగ్రహాలు ఉంచినట్లయితే, అది గృహ జీవితానికి అనుకూలమైనది కాదని అంటారు.

రెండు గోమతి చక్రాలు  ఉంటే..

గోమతి చక్రం ఆనందం,  శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే ఇంట్లో రెండు గోమతి చక్రాలను ఉంచడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

రెండు శాలిగ్రామాలు ఉంటే..

శాలిగ్రామాలు విష్ణువు  చిహ్నాలుగా పరిగణిస్తారు. వీటిని  చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. సాధారణంగానే శాలిగ్రామం పూజ చేసుకోవాలి అంటే చాలా నిష్ట ఉండాలి.  ఆడవారు నెలసరి కలుపుకునే ఇంట్లో శాలిగ్రామం ఉంచి పూజ చెయ్యడం వల్ల మేలు కంటే చెడు ఎక్కువ జరుగుతుంది.  ఒక వేళ నిష్టగా పూజ చేసుకున్నా ఇంట్లో రెండు శాలిగ్రామాలు ఉంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందట.


                                 *రూపశ్రీ


More Enduku-Emiti