ఐసీయూలో ఎస్పీ బాలు... పరిస్థితి ఆందోళనకరం!
on Aug 14, 2020
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం (ఆగస్టు 5న) కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో ఆయన చేరారు. అప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. తనది మైల్డ్ కరోనా అనీ, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతాననీ ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కానీ, బాలు ఆరోగ్య పరిస్థితి విషమించిందట.
గురువారం రాత్రి ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీయూకి షిఫ్ట్ చేసినట్టు ఎంజిఎం ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో దిగ్గజ గాయకుడికి ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కానీ, కండిషన్ క్రిటికల్ అని, వెంటిలేటర్ మీద ఉన్నారని పేర్కొనడంతో ఎస్పీ బాలు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.