'పుష్ప' టీమ్ మెంబర్స్కు కొవిడ్.. హైదరాబాద్ వచ్చేసిన అల్లు అర్జున్!
on Dec 2, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'పుష్ప''. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో మొదలైంది. అక్కడే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ట్రక్ డ్రైవర్ పుష్పరాజ్గా నటిస్తోన్న బన్నీ సైతం ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం యూనిట్ సభ్యుల్లో కొంతమందికి కొవిడ్ 19 సోకినట్లుగా నిర్ధారణ కావడంతో అంతా ఖంగు తిన్నారు.
అందిన సమాచారం ప్రకారం పది మందికిపైగా టెస్ట్లో కొవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందంటున్నారు. అనేకమంది జూనియర్ ఆర్టిస్టులతో డైరెక్టర్ సుకుమార్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చింది. దాంతో యూనిట్ మొత్తం ఐసోలేషన్కు వెళ్లాలనీ, టెస్ట్ చేయించుకోవాలనీ ఆదేశాలు వెళ్లాయి. చేసేదేమీ లేక బన్నీ హైదరాబాద్ తిరిగొచ్చేశాడు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథ కావడంతో ఎక్కువ శాతం షూటింగ్ అడవుల్లోనే చిత్రీకరించాల్సి ఉంది. అందుకే ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. మార్చిలోనే 'పుష్ప' షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా ఎనిమిది నెలలు ఆలస్యంగా షూటింగ్ మొదలైంది. ఇప్పుడో కరోనా కారణంగా మరోసారి షూటింగ్ ఆగిపోయింది.
Also Read