చిరు-రాజశేఖర్ ఇంకా కొట్టుకుంటున్నారా..?
on Jun 13, 2017
మెగాస్టార్ చిరంజీవి..రాజశేఖర్ మధ్య తలెత్తిన మనస్పర్థలు ఇంకా సద్దుమణగలేదా..? ఏళ్లు గడుస్తున్నా ఇద్దరి మధ్య దూరం తగ్గలేదా అంటే అవుననే చెప్పవచ్చు. ఇద్దరు కలిసిపోయారని..విభేదాలు మరచిపోయారని భావిస్తూ వచ్చిన ఇండస్ట్రీకి దాసరి సంస్మరణ సభలో జరిగిన సంఘటన షాక్ ఇచ్చింది. ఇటీవల కన్నుమూసిన దాసరి సంస్మరణార్థం ఫిలింనగర్లో సంతాపసభను ఏర్పాటు చేశారు. దీనికి చిరు హాజరై..మాట్లాడి వెళ్లిన తర్వాత రాజశేఖర్ దంపతులు రావటంతో..వీరి మధ్య విభేదాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఈనాటివి కావు... తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన రమణ సినిమా హక్కుల్ని రాజశేఖర్ మొదట కొనుగోలు చేశారు.
కానీ లాస్ట్ మినట్ సీన్లోకి ఎంటరైన చిరు ఆ హక్కుల్ని తన సొంతం చేసుకోవటంతో రాజశేఖర్ తన ఆవేదనను బహిరంగంగానే తెలిపారు. ఆ తర్వాత చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నేపథ్యంలో రాజశేఖర్ దంపతులు ఆ పార్టీపైనా..మెగాస్టార్పైనా వ్యక్తిగతంగా విమర్శలు చేశారు..దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగా అభిమానులు రాజశేఖర్ దంపతులు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేయటం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. గొడవను సద్దుమణిగించే ఉద్దేశ్యంతో చిరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇంత జరిగినా..కాలం గడుస్తున్నా..రాజశేఖర్ తనకు జరిగిన అన్యాయాన్ని మరచిపోలేకపోతున్నారని అందుకే దాసరి సంస్మరణ సభలో అలా చేశారని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.