మీరా చోప్రాకు కేటీఆర్ భరోసా! తారక్ ఫ్యాన్స్కు తిప్పలే!!
on Jun 5, 2020
జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలీదనీ, తాను ఆయన అభిమానిని కాననీ, మహేశ్బాబు ఫ్యాన్ననీ సోషల్ మీడియా ఇంటరాక్టివ్ సెషన్లో చెప్పినందుకు తారక్ ఫ్యాన్స్ నటి మీరా చోప్రాను అభ్యంతరకర, అసభ్యకర భాషతో దూషించారు. ఆ కామెంట్లకు, బెదిరింపులకు అప్సెట్ అయిన మీరా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేశ్ అభిమానినవడం నేరమని తనకు తెలీదని తారక్కు చేసిన ట్వీట్లో ఆమె పేర్కొంది. ఈ ట్వీట్ను మహేశ్బాబుకు సైతం ఆమె టాగ్ చేసింది.
అలాగే తారక్ ఫ్యాన్స్ చేసిన అసభ్యకర, బెదిరింపు ట్వీట్ల స్క్రీన్షాట్స్ను తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు షేర్ చేసిన మీరా, వాళ్ల సాయాన్ని అర్థించింది. "నేను మీ రాష్ట్రంలో గ్యాంగ్రేప్, యాసిడ్ ఎటాక్, బెదిరింపులు, సైబర్ వేధింపులు, లైంగిక వేధింపులు వంటి బెదిరింపులకు గురయ్యాను. హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళల క్షేమం కోసం ఇలాంటి వాటిని తరచుగా దర్యాప్తు చేయాలని ఆశిస్తున్నాను" అని ఆమె ఆ ట్వీట్లో పేర్కొంది.
మీరాకు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. "మేడమ్, మీ ఫిర్యాదు ఆధారంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను కోరాను" అని ఆయన భరోసా ఇచ్చారు. కేటీఆర్ ట్వీట్తో మీరా చోప్రా విషయంలో హైదరాబాద్ పోలీసులు చట్టప్రకారం తమ పని చేయబోతున్నారనేది స్పష్టం. మీరాను ట్రోల్ చేసిన తారక్ ఫ్యాన్స్ గుండెల్లో రాయిపడినట్లే.