కనిక.. ఐదోసారీ కరోనా పాజిటివ్!
on Apr 1, 2020
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు ఐదవసారి జరిపిన కోవిడ్-19 పరీక్షలోనూ పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్ సోకిన రోగులకు ప్రతి 48 గంటలకు ఓసారి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. కనిక ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స తీసుకుంటున్నారు. ఐదోసారి పాజిటివ్ వచ్చినప్పటికీ కనిక ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన పనిలేదనీ ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్. దిమన్ తెలిపారు. మొత్తానికి వరుసగా ఐదోసారి కూడా కనికకు పాజిటివ్ రావడం గమనార్హం.
రెండు వారాలుగా ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తనకు నావెల్ కరోనావైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని మార్చి 20న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె స్వయంగా తెలిపారు. అప్పటికే ఆమె పలువురు ప్రముఖులతో కలిసి పార్టీలలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. యూకే నుంచి వచ్చిన ఆమె కారణంగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె తనయుడు దుష్యంత్ సింగ్ క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. అలాగే డెరెక్ ఓబ్రియన్, అనుప్రియా పటేల్, సంజయ్ సింగ్ వంటి పలువురు స్వీయ-ఐసోలేషన్లోకి వెళ్లారు.
లండన్ నుంచి ఇండియాకు వచ్చిన కనిక సెల్ఫ్-ఐసోలేషన్కు వెళ్లకుండా, తన ప్రయాణ చరిత్రను దాచిపెట్టి పార్టీలలో పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెపై కేసు కూడా ఫైల్ చేసింది.
Also Read