ఇండస్ట్రీ మీద సంపాదిస్తున్న హీరోయిన్లు డొనేషన్లు ఇవ్వరా?
on Mar 31, 2020
టాలీవుడ్కు చెందిన అనేకమంది నటులు కరోనా క్రైసిస్ చారిటీకి విరాళాలు అందించగా, ఇదే ఇండస్ట్రీపై ఆధారపడి డబ్బు సంపాదిస్తోన్న హీరోయిన్లు విరాళాలు అందించడం లేదనే విమర్శలు ఫిల్మ్నగర్లో వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఒక్క లావణ్యా త్రిపాఠి మాత్రమే మినహాయింపు. ఈ విషయమే నటుడు బ్రహ్మాజీకి ఆగ్రహం తెప్పించింది. షూటింగ్లు లేకపోవడంతో కష్టాలు పడుతున్న సినీ కార్మికుల అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటైన సీసీసీకి బ్రహ్మాజీ రూ. 75 వేలు, ఓ పిట్టకథతో హీరోగా పరిచయమైన ఆయన తనయుడు సంజయ్ రావు రూ. 25 వేలు విరాళంగా అందజేశారు.
టాలీవుడ్లో పూజా హెగ్డే వంటి టాప్ హీరోయిన్ మొదలుకొని, సీనియర్ హీరోయిన్లయిన అనుష్క, కాజల్ అగర్వాల్ వంటి ఎంతోమంది తారలు ఉన్నారు. వీరెవరూ ఇంతవరకూ ఎలాంటి విరాళాలు కానీ, మరో విధమైన ఆర్థిక సాయం కానీ ప్రకటించలేదు. దీనినే బ్రహ్మాజీ ప్రశ్నించారు. ముంబై నుంచీ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ వచ్చి, హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకున్న తారలు అవసరం వచ్చినప్పుడు స్పందించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. టాలీవుడ్లో అధిక రెమ్యూనరేషన్లు పొందుతున్న తారలు.. ఈ సంక్షోభ సమయంలో సినీ కార్మికులను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
"ఒక్క లావణ్యా త్రిపాఠి తప్పితే వేరే తారలెవరూ సీసీసీకి డొనేషన్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఇది డబ్బుకు సంబంధించిన అంశం కాదు, ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపించాల్సిన అంశం" అని ఆయన అన్నారు. అలాగే, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంపై కూడా బ్రహ్మాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read