ఒకే ఏడాది.. ఒకే కాంపౌండ్.. 3 డిజాస్టర్స్!
on Oct 25, 2020
ఇది నిజంగా బాధాకరమైన సంగతి. ఒకే ఏడాది ఒకే కాంపౌండుకు చెందిన ముగ్గురు భిన్న హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ఒక దాన్ని మించి ఒకటి బోల్తాపడ్డాయి. ఆ సంవత్సరం 2010.. ఆ కాంపౌండ్ మెగా కాపౌండ్.. ఆ మూడు సినిమాలు.. అల్లు అర్జున్ సినిమా 'వరుడు', పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి', రాంచరణ్ సినిమా 'ఆరెంజ్'.
గుణశేఖర్ డైరెక్ట్ చేసిన 'వరుడు' సినిమా మార్చి 31న విడుదలైంది. భానుశ్రీ మెహ్రా అనే కొత్తమ్మాయిని ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం చేశారు. తమిళ హీరో ఆర్య విలన్గా దర్శనమిచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమై, అల్లు అర్జున్ కెరీర్లో తొలి డిజాస్టర్ ఫిల్మ్గా పేరు తెచ్చుకుంది.
పవన్ కల్యాణ్కు అదివరకు 'ఖుషి' లాంటి బ్లాక్బస్టర్ మూవీనిచ్చి, ఆయన ఇమేజ్ను అనేక రెట్లు పెరిగేట్లు చేసిన డైరెక్టర్ ఎస్.జె. సూర్య తీసిన 'కొమరం పులి' (తర్వాత 'పులి'గా పేరు మారింది) సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నికితా పటేల్ హీరోయిన్గా పరిచయమైన ఈ సినిమాలో తల్లీకొడుకుల సెంటిమెంట్ కూడా వర్కవుట్ కాలేదు. పవన్ కెరీర్లోని డిజాస్టర్స్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.
ఇక 'మగధీర' లాంటి ఇండస్ట్రీ రికార్డ్ మూవీ తర్వాత రామ్చరణ్ హీరోగా నటించిన సినిమాగా 'ఆరెంజ్' నవంబర్ 26న విడుదలైంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ బాబాయ్ నాగబాబు నిర్మించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్. 'మగధీర'లో లార్జర్ దేన్ లైఫ్ తరహా క్యారెక్టర్లో రామ్ చరణ్ను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో పెళ్లి అనే శాశ్వత బంధంపై నమ్మకంలేని యాంటీ సెంటిమెంట్ క్యారెక్టర్లో చూడలేకపోయారు. ఫలితంగా ఈ సినిమా డిజాస్టర్ కావడమే కాకుండా నాగబాబును నిలువునా ముంచేసి, కోలుకోలేని రీతిలో ఆర్థికంగా బాగా దెబ్బ తీసింది. తన కాంపౌండుకే చెందిన ఈ సినిమాని అల్లు అరవింద్ తన గీతా డిస్ట్రిబ్యూటర్స్పై రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఏషియన్ ఫిలిమ్స్పై సునీల్ నారంగ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. 'మగధీర' వంటి గొప్ప సినిమా తర్వాత ఆ హీరో ఎలాంటి సినిమా చేయాలి? కచ్చితంగా 'ఆరెంజ్' లాంటి సినిమా మాత్రం కాదు.. అనే మాటలు బాగా వినిపించాయి.
Also Read