పానకంలో పుడకలా ఈవిడేంటి?
on Aug 17, 2017
పానకంలో పుడకలా ఈవిడేంటి? అని తెగ రుసరుసలాడిపోతున్నారు ఆ నలుగురు. ఇంతకీ ఎవరా నలుగురు? ఈ పానకంలో పుడక ఎవరు? అనేగా మీ అనుమానం. ఆ నలుగురు ఎవరో కాదు... నిర్మాతలు దిల్ రాజు, డి.సురేశ్ బాబు, సుధాకరరెడ్డి, బెల్లంకొండ సురేశ్. ఇక పానకం పుడక ఢిల్లీ భామ ‘తాప్సీ’. వివరాల్లోకెళ్తే..
చక్కగా వీకెండ్, వెంటనే మూడ్రోజుల సెలవులు.. బాక్సాఫీస్ ని వండేసుకోవచ్చని.. గత శుక్రవారం మూడు సినిమాలు విడుదలయ్యాయి. అవే నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై. విచిత్రం ఏంటంటే.. ఈ మూడు చిత్రాలకు మంచి టాకే వచ్చింది. అయితే.. థియేటర్లలో అనుకున్న స్థాయిలో జనాలే ఉండటం లేదు. దాంతో మూడు చిత్రాల నిర్మాతలు పెట్టుకున్న ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయ్. ‘మంచి టాక్ ఉంది కాబట్టి మన డబ్బులు మనకొస్తాయిలే’ అనే నమ్మకం మాత్రం వీరిలో ఇంకా సన్నగిల్లలేదు. మరో వైపు దిల్ రాజు ‘ఫిదా’ చిత్రం రెండు రాష్ట్రాల్లోనూ... వసూళ్లతో దుమ్మురేపేస్తోంది.
ఇదిలావుంటే... పానకంలో పుడకలా.. ఈ శుక్రవారం తాప్సీ ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై చిత్రాలే ఆడుతున్నాయ్. మరి ఇలాంటి పరిస్థితుల్లో తాప్సీ సినిమాకు సరైన థియేటర్లు దొరకడం కూడా కష్టమే. మరి తాప్సీ ‘ఆనందో బ్రహ్మ’ పరిస్థితి ఏంటో, ఎలాంటి థియేటర్లలో విడుదలవుతుందో, ఎన్ని థియేటర్లు ఈ సినిమాకు దక్కుతాయో తెలియాలంటే.. రేపటి దాకా ఆగాల్సిదే.