టాప్ స్టార్స్తో రాజమౌళి మల్టీస్టారర్?
on Jul 13, 2017
రాజమౌళి తర్వాత సినిమా ఏంటి? సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే టాపిక్. ‘బాహుబలి’నిర్మాణ సమయంలో ‘గరుడ’గురించి బాగా డిస్కషన్ జరిగింది. పౌరాణిక గాధ అయిన గరుత్మంతుని చరిత్రను ‘గరుడ’గా తెరకెక్కిస్తారనీ, ఇది దాదాపు వెయ్యికోట్ల ప్రాజెక్ట్ అని అప్పట్లో చెప్పుకున్నారు. అయితే... ‘బాహుబలి’సిరీస్ తర్వాత రాజమౌళీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసినట్లు తెలిసింది. ఈ దఫా తీసే సినిమా అంత బడ్జెట్ లో ఉండదనీ, మామూలు బడ్జెట్ లోనే చేస్తానని మొన్నామధ్య మీడియాతో రాజమౌళి కూడా చెప్పేశారు కూడా. అయితే... ఇప్పుడాయన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తుంది. మళ్లీ భారీ సినిమా వైపే ఆయన చూస్తున్నట్లు విశ్వసనీయ సమచారం. పైగా భారీ మల్టీస్టారర్ కి ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో నటించే హీరోలుగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయ్ అనుకుంటున్నారు? ఇంకెవరు... సూపర్ స్టార్ మహేశ్-యంగ్ టైగర్ ఎన్టీయార్. వీరిద్దరికీ సరిపడు కథ కూడా రెడీగా ఉండటంతో పేపర్ వర్క్ లో బిజీగా ఉన్నారట రాజమౌళి. డీవీవీ దానయ్యే ఈ చిత్రాన్ని నిర్మిస్తారా? లేక మరో నిర్మాత కూడా ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా వుంటే.. గతంలో మహానటుడు ఎన్టీయార్ తో సూపర్ స్టార్ కృష్ణ.. స్త్రీ జన్మ, నిండు కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరిదీ మంచి హిట్ కాంబినేషన్ కూడా. మళ్లీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఎన్టీయార్ మూడో తరం హీరో అయిన తారక్, కృష్ణ నట వారసుడు మహేశ్ కలిసి ఒకేసారి తెరను పంచుకోనున్నారు అంటే... అది నిజంగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశమే కదా. పైగా ఆ సినిమాకు ఎస్.ఎస్.రాజమౌళీ దర్శకుడు. ఇక చెప్పేదేముంది. మహేశ్ ఇప్పటికే ఒక మల్టీస్టారర్లో నటించారు. అదే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’. అందులో ఆయన వెంకటేశ్ తో తెర పంచుకున్న విషయం తెలిసిందే. అయితే... తారక్ మాత్రం ఇప్పటివరకూ ఒక్క మల్టీస్టారర్లో కూడా చేయలేదు. ఒక వేళ ఈ ప్రాజెక్ట్ నిజమై పట్టాలెక్కితే... ఇది తారక్ నటించే తొలి మల్టీస్టారర్ అవుతుంది. ‘బాహుబలి’ లాంటి జానపద కథతో రికార్డులన్నింటినీ తిరగరాసిన రాజమౌళి.. ఈ దఫా ఎలాంటి కథను ఎంచుకుంటారో... ఎన్ని రికార్డులకు టార్గెట్ చేస్తారో చూడాలి. ఈ వార్తలో నిజం ఉంటే...ఇక అభిమానులకు పండగే.