Facebook Twitter
చందమామ కథ అర్థరాత్రి

చందమామ కథ అర్థరాత్రి

నారాయణపురంలోని భూస్వామి వెంకటాద్రి కొడుకు సింహాచలం తెలివైనవాడే గాని పరమ బద్ధకస్తుడు. కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి. చెమటోడ్చి కష్టపడకపోయినా దగ్గరుండి పనులు చేయించవచ్చుకదా అని తండ్రి ఎంత చెప్పినా సింహాచలం పొలంకేసి వెళ్ళేవాడు కాడు. బలవంతం మీద వెళ్ళినా పనులు చేసేవాళ్ళను అడ్డదిడ్డమైన ప్రశ్నలడిగి తికమక పెడుతూ పనులు చెడగొట్టేవాడు.

ఊళ్ళో కనిపించినవారినల్లా అర్థం పర్థం లేని ప్రశ్నలడిగి విసిగించేవాడు. అందువల్ల సింహాచలాన్ని చూడగానే గ్రామ ప్రజలు పక్కకు తప్పుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి దూరంలోని రాజవరంలో జాతర జరుగుతుంటే చూద్దామని పాలేరు మారన్నను వెంటబెట్టుకుని వెళ్ళాడు సింహాచలం. వినోదాల్లో పడి సమయం మరిచిపోవడంతో అక్కడే చీకటిపడింది. ఇద్దరూ తిరుగు ప్రయాణమై త్వరగా ఊరుచేరాలన్న తొందరలో దారి తప్పారు. వెనక్కు తిరగాలన్నా కటిక చీకటి. ఏం చేయాలో పాలుపోక చూస్తూంటే, దూరంగా మిణుకు మిణుకుమంటూ వెలుతురు కనిపించింది. అతి ప్రయాసతో వాళ్ళు ఆ వెలుతురును సమీపించారు. అక్కడ ఒక గుడిసెలో బైరాగి కనిపించాడు. ఆయన్ను చూడగానే సింహాచలం జనసంచారం లేని ఈ అడవి ప్రాంతంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఊరికి దూరంలో ఉన్నంత మాత్రాన బాధలు దూరమై పోతాయా? ఇక్కడ తిండికే కష్టం కదా? నువ్వు నిజంగానే బైరాగివా లేక సంసార బాధలు భరించలేక పారిపోయివచ్చావా? కొంపదీసి నేరాలు చేసి పారిపోయి రాలేదు కదా!'' అంటూ తన అలవాటు ప్రకారం అనేక ప్రశ్నలు అడిగాడు.

బైరాగి చిన్నగానవ్వి, బాగా అలిసిపోయి ఉన్నావు. ఇప్పుడు ఈ అరటిపండు తిని ప్రశాంతంగా నిద్రపో నాయనా. తెల్లవారాక నీ అనుమానాలన్నీ తీరుస్తాను, అంటూ ఒక పండు ఇచ్చాడు. సింహాచలం దాన్ని తిని, గుడిసెలో పడుకున్నాడు. పాలేరు అతడికి కొంచెం పెడగా పడుకుని నిద్రపోయాడు. అంతలో సింహాచలానికి పొడవాటి చెట్లు బోలెడు కనిపించాయి. అంతే కాదు. అక్కడ పట్టపగలులా వెలుతురు ఉంది. సింహాచలం వడివడిగా వెళ్ళి ఆ ప్రాంతం చేరాడు. అతణ్ణి చూడగానే కొందరు పొడవాటి మనుషులు చెట్లపై నుంచి కిందికి గబగబా దిగివచ్చి అతని చుట్టూమూగారు. వారిలో ఒకడు సింహాచలానికి నమస్కరించి, అయ్యా, నా పేరు మద్దయ్య. ఎంతో కాలానికి మా ఊరు వచ్చిన అతిథి మీరు. సూరీడు పల్లె తరఫున స్వాగతం పలుకుతున్నాం. మా ఆతిథ్యం స్వీకరించండి,'' అన్నాడు. ‘‘మీరు చెట్లపై నుంచి దిగారు కదా. మరి మీ ఇళ్ళెక్కడ?'' అని అడిగాడు సింహాచలం. ‘‘మా ఊళ్ళో ఇళ్ళు చెట్ల మీద ఉంటాయి,'' అని పైకి చూపించాడు మద్దయ్య. తలెత్తి చూసిన సింహాచలానికి పొడవైన చెట్ల మీద అందమైన పెంకుటిళ్ళు కనిపించాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన సింహాచలం, ‘‘నాకు తెలిసి ఇది అర్ధరాత్రి. మరి మీ ఊళ్ళో పట్టపగలుగా ఉంది. ఏమిటీ విడ్డూరం?'' అని అడిగాడు. అందుకు వేపయ్య అనే పొడగరి, ‘‘మాది సూరీడు పల్లె. ఇక్కడ సూర్య అస్తమయం అంటూ ఉండదు. మా పల్లెకు వచ్చిన వారికి చక్కని ఆతిథ్యం ఇవ్వాలనీ, ఎప్పుడో పెద్దలు ఏర్పరచుకున్న కొన్ని నియమాలను విధిగా పాటించాలనీ, లేకుంటే సూర్యుడు మాయమై మాది శాశ్వతంగా చీకటిపల్లెగా మారిపోతుందనీ మా పూర్వీకులు చెప్పారు. అందుకే అతిథుల కోసం ప్రత్యేకంగా అందమైన చక్కని అతిథిగృహం కూడా నిర్మించాం,'' అన్నాడు. ‘‘ఆ అతిథిగృహమైనా నేల మీద ఉందా? అదీ చెట్టుపైనేనా?'' అని అడిగాడు సింహాచలం.‘‘దాన్ని మిగతా వాటికన్నా మరీ ఎత్తున కట్టాం,'' అని మద్దయ్య అనేవాడు సింహాచలానికి సరివి చెట్టు పైనున్న అతిథిగృహం చూపించాడు. ‘‘నాకు చెట్టెక్కడం రాదు,'' అన్నాడు సింహాచలం. ‘‘ఆ సంగతి మేము చూసుకుంటాం,'' అంటూ వాళ్ళు సింహాచలం కాళ్ళకు చక్రాలు కట్టారు. అంతే. సింహాచలం గిరగిరా తిరుగుతూ చెట్టుపైనున్న అతిథిగృహం చేరాడు. అతడి వెనకనే తక్కిన వారందరూ అక్కడికి చేరి, అతిథిగృహంలో వెదురుబొంగులతో తయారు చేసిన అందమైన సింహాసనం మీద సింహాచలాన్ని కూర్చోబెట్టారు.

అక్కడున్న రాళ్ళ పొయ్యి చుట్టూ ఒక నల్ల పిల్లి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ పిల్లివంక వింతగా చూస్తూన్న సింహాచలంతో, ‘‘బద్ధకస్తులను నల్లపిల్లులుగా మార్చి, మా అందరికీ వంటలు చేయిస్తూంటాం,'' అన్న గంధమయ్య అనే మనిషి మాట విని అతడు ఉలిక్కిపడ్డాడు. అంతలో కింద కోలాహలం వినిపించి సింహాచలం తొంగి చూశాడు. అక్కడ చాలా మంది నృత్యాలు చేస్తున్నారు. ‘‘చాలాకాలానికి అతిథిగా నువ్వొచ్చావు గనక, మా వాళ్ళు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు,'' అన్నాడు మద్దయ్య. కింద ఉన్నవాళ్ళు సింహాచలాన్ని కిందికి రమ్మని ఉత్సాహంతో చేతులు ఊపారు. సింహాచలం మళ్ళీ కాళ్ళకు చక్రాలు కట్టుకుని కిందికి దిగాడు. అక్కడున్న వాళ్ళు వెదురు పాత్రలలో ఉన్న రసం తాగుతూ, ఒక పాత్ర సింహాచలానికి అందించారు. ఆ రసం రుచి చూసిన సింహాచలం, ‘‘చాలా బావుంది. ఏం పానీయం ఇది? అవునూ, ఈ పానీయాన్ని పాత్రలలో నింపుతూన్న ఆ ఇద్దరూ మౌనంగా విచారంతో ఉన్నారెందుకు?'' అని అడిగాడు వాళ్ళను చూపుతూ.

‘‘ఆ ఇద్దరు మౌనస్వాములే ఐదు రకాల మధుర ఫలరసాలతో కొండతేనె కలిపి ఈ అద్భుత పానీయం తయారు చేశారు. అర్థం పర్థం లేని ప్రశ్నలతో మమ్మల్ని విసిగించే వారిద్దరి నాలుకలూ కత్తిరించి మరిక ప్రశ్నలు వేయకుండా పానీయం తయారుచేసే పని అప్పగించాం. అలాంటి వారికి మేము విధించే శిక్ష ఇదే!'' అన్నాడు చింతయ్య అనే పొడగరి. సింహాచలం భయకంపితుడయ్యాడు. అంతలో నిప్పులవాన ఆరంభం కావడంతో అందరూ పట్టరాని ఆనందంతో నాట్యం చేయసాగారు. నువ్వు రావడం వల్లనే ఈ నిప్పులవాన కురుస్తోంది. మేము నీకెంతో రుణపడి ఉన్నాం. ఏం కావాలో కోరుకో. తప్పక తీరుస్తాం, అన్నాడు మద్దయ్య. నన్ను వెంటనే మా ఊరు చేర్చండి. అది చాలు. లేకుంటే ఏదో ఒక చెట్టుకు ఉరిపోసుకుంటాను, అన్నాడు సింహాచలం. అంతపని చెయ్యకు. నువ్వు కోరినట్టే మీ ఊరు పంపుతాం, అంటూ నలుగురు పొడగరులు సింహాచలాన్ని ఎత్తిపట్టుకుని గిరగిరా తిప్పి విసిరివేశారు. సింహాచలం గాలిలో పల్టీలు కొడుతూ, కాపాడండి, కాపాడండి, అని బిగ్గరగా అరవసాగాడు. పక్కనే పడుకున్న పాలేరు మారన్న సింహాచలాన్ని తట్టి లేపుతూ, ఏమిటి బాబూ, ఏదైనా కలగన్నావా? అని అడిగాడు. కళ్ళు తెరిచిన సింహాచలం, అవును, కలే! అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. ఆ తరవాత అతనికి నిద్రపట్టలేదు. గుడిసె నుంచి వెలుపలికి వచ్చాడు. వణికించే చలిలో శరీరం మీద ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా ఒంటి కాలిపై నిలబడి ధ్యానం చేస్తున్న బైరాగిని చూసి, విస్తుపోయాడు. తెల్లవారుతూండగా కళ్ళు తెరిచిన బైరాగి కాళ్ళపై బడి మొక్కాడు సింహాచలం. బైరాగి అతణ్ణి మందహాసంతో లేవనెత్తుతూ, నీ సందేహాలకు సమాధానాలు లభించాయా నాయనా? అని అడిగాడు. సింహాచలం అవునన్నట్టు తలూపాడు.

కాలం దైవస్వరూపం. బద్ధకం పరమ నీచస్వభావం. అనవసరమైన వాచాలతతో కాలాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకో, అని దీవించాడు బైరాగి. పాలేరుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చిన సింహాచలం, ఆరోజు నుంచి కనిపించినవారిని అడ్డమైన ప్రశ్నలతో వేధించడం మానేశాడు. బద్ధకం వదిలి కష్టపడి పని చేస్తూ, తండ్రి చెప్పినట్టు నడుచుకుంటూ అందరిచేతా ప్రయోజకుడనిపించుకున్నాడు.