Facebook Twitter
సత్రం యజమాని పేరాశ (చందమామ కథ)

పాండ్యరాజులు పాలించే కాలంలో మధుర సంపదలతో తులతూగే నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఆ కాలంలో చిన్నసామి అనే వీధులు ఊడ్చేవాడు ఉండేవాడు. వేకువ జామునే లేచి రాజు దైవదర్శనానికి వచ్చే మార్గాన్ని శుభ్రంగా చిమ్మడం వాడి పని. రాజు జోడు గుర్రాల బంగారు రథంలో దేవాలయానికి వచ్చేవాడు. ఆయనకు ముందు ఇద్దరు అంగరక్షకులు గుర్రాలపై వచ్చి మార్గాన్ని పరిశీలించేవారు. ఒకనాడు చిన్నసామి తనను దాటి వెళుతూన్న రాజుగారి అంగరక్షకులను పరిశీలనగా చూశాడు. వాళ్ళు ఎరట్రి ఉడుపులు ధరించి, పట్టు తల పాగాలను పెట్టుకుని ఉన్నారు. తను కూడా రాజుగారి అంగరక్షకుడయితే ఎంత బావుణ్ణు అనుకున్నాడు చిన్నసామి. ఆరోజు పనిని ముగించుకుని చిన్నసామి ఇంటికి చేరాడు. కాళ్ళు చేతులు కడుక్కుని నులక మంచం మీద నడుంవాల్చాడు. అంతలో భార్య తంగమ్మ వాడికి తాగడానికి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. రాజుగారి అంగరక్షకులు ఎక్కివచ్చే గుర్రాలు చాలా బావున్నాయి. అలాంటి గుర్రం ఒకటి నాకూ వుంటే బావుంటుంది కదా అన్నాడు చిన్నసామి. అంగరక్షకుల గుర్రాలా? అసలు నీకు గుర్రం ఎక్కి స్వారీ చేయడం చేతనవునా?'అన్నది తంగమ్మ. నేను భయం లేకుండా గురప్రు స్వారీ చేయగలను. ఒకరోజు చేసి చూపిస్తాను చూడు అన్నాడు వాడు రోషంగా. ‘మరుపూట తినడానికి తిండిలేనివాళ్ళం. గుర్రాల సంగతి మనకెందుకు? ఇంటికప్పు ఎగిరిపోయింది. వర్షాకాలం వచ్చేలోగా సరి చేసుకోవాలి. నువ్వు అడవిలోని కొండ మీదికి వెళ్ళి  కొండదేవుణ్ణి ప్రార్థించి, మన ఇంటికప్పు సరిచేసుకోవడానికి కావలసిన డబ్బు తేవచ్చు కదా? నేను ఇప్పుడు జమీందారు ఇంటికి వెళుతున్నాను. ఈ రోజు జమీందారు మనవడికి పుట్టినరోజు. అక్కడ బోలెడు పనులున్నాయి. ఎక్కువ డబ్బుతో పాటు మనిద్దరికీ మంచి భోజనం కూడా దొరకవచ్చు,'' అన్నది తంగమ్మ. ‘‘నువ్వు చెప్పావుగా. నేనిప్పుడే కొండకు బయలుదేరుతున్నాను,'' అంటూ అప్పటి కప్పుడే బయలుదేరాడు చిన్నసామి. ‘‘తంగం నా మాట నమ్మడం లేదుగాని, ఏది ఏమైనా సరే ఇవాళ నేను అడవిలోని కొండమీదికి వెళ్ళి తీరతాను. అక్కడ దేవుడు కనిపించనీ, కనిపించకపోనీ,'' అనుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తూ, చిన్నసామి ఒకసారి వెనక్కు తిరిగి చూశాడు. గోడకు ఆనించిన పొడవాటి చీపురుకట్ట కనిపించడంతో, తెల్లవారేలాగా తాను తిరిగి వచ్చి రాజు వచ్చే లోగా ఆలయ మార్గాన్ని చిమ్మాలన్న విషయం వాడికి గుర్తుకు వచ్చింది. వేగ వేగంగా నడిచి వెళ్ళి అడవి ప్రాంతంలోని నల్లటి కొండను సమీపించాడు. అతి కష్టం మీద కొండను ఎక్కసాగాడు. కొంత దూరం పైకి వెళ్ళాక ఒక గుహ కనిపించింది. కాళ్ళు నొప్పి పుట్టడంతో, గూహ ఎదుట చతికిలబడ్డాడు. తలకు చుట్టుకున్న తువ్వాలును విప్పి, తలకింద పెట్టుకుని అలసటతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. కలలో ఎవరో, ‘‘చిన్నసామీ! లేలే!'' అని తట్టి లేపినట్టయి, లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుము కుంటూ చుట్టుపక్కల కలయచూశాడు. ఎవరూ కనిపించలేదు. ‘‘చిన్నసామీ! నువ్వు కొండదేవుణ్ణి చూడడానికే కదా ఇంత దూరం వచ్చావు. నేనే ‘మలై వాణన్‌' అనే కొండదేవుణ్ణి. నీపక్కనే ఒక శంఖం వుంది చూడు. దాన్ని తీసుకో. నీ కేదైనా కావలసి వచ్చినప్పుడు -ఆహారం, డబ్బు, కొత్త ఇంటి కప్పు, గుర్రాలు ఇలా ఏదైనా సరే, దానిని కోరు కుంటూ ఈ శంఖాన్ని ఊదావంటే అది లభిస్తుంది,'' అన్న కంఠస్వరం వినిపించింది. చిన్నసామి తల తిప్పి చూశాడు. గుహ ముఖ ద్వారంలో తళతళా వెండిలా మెరుస్తూ ఒక శంఖం కనిపించింది. వాడు లేచి వెళ్ళి దానిని తీసుకుని, తువ్వాలులో ముడివేసుకుని తలకు చుట్టుకుని ఇంటి కేసి తిరుగుముఖం పట్టాడు. కొండదిగి అడవీ ప్రాంతాన్ని దాటే సరికి పొద్దుగూక సాగింది. వాడు మరింత వేగంగా నడవ సాగాడు. కొంత సేపటికి నాలుగు వైపులా చీకటి కమ్ముకోసాగింది. దూరంగా మిణుకు మిణుకు మంటూ వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్ళాడు. అదొక సత్రం. రాత్రి అక్కడే గడపాలను కున్నాడు. సత్రం యజమాని ఒక గదిని చూపి భోజనం తీసుకురావడానికి వెళ్ళాడు. సత్రం యజమానికి డబ్బు చెల్లించాలి కదా? అందువల్ల పది వెండికాసులు కావాలని కోరుకుని చిన్నసామి శంఖాన్ని తీసి మెల్లగా ఊదాడు. సత్రం యజమాని భోజనం తెచ్చి పెడుతూ, ‘‘ఇంతకు ముందు నువ్వేమైనా శంఖం ఊదావా?'' అని అడిగాడు యథాలాపంగా. ‘‘అవును, నేనే ఊదాను,'' అంటూ చిన్న సామి భోజనం పళ్ళెం అందుకున్నాడు. అంతకు ముందే తువ్వాలులో ముడివేసిన శంఖాన్ని చూపుతూ-తను కొండదేవుణ్ణి చూడాలని కొండ మీదికి వెళ్ళిన విషయమూ, కొండ దేవుడు తనకు మాయా శంఖాన్ని ఇచ్చి ఆశీర్వదించిన సంగతీ పూసగుచ్చినట్టు వివరిస్తూ భోజనం ముగించాడు. ఆ విషయం తెలియగానే దురాశాపరుడైన సత్రం యజమాని బుర్ర రకరకాల ఆలోచనలతో వేడెక్కింది. చిన్నసామి గాఢనిద్రలో ఉన్న ప్పుడు పిల్లిలా వాడి గదిలోకి జొరబడి, వాడు తువ్వాలులో దాచిన మాయా శంఖాన్ని తీసుకుని, దాని స్థానంలో అదే పరిమాణంలోని మరొక శంఖాన్ని ముడివేసి గుట్టుచప్పుడు కాకుండా వచ్చేశాడు. తెల్లవారగానే చిన్నసామి బయలుదేరుతూ, సత్రం యజమానికి డబ్బు ఇవ్వబోగా, అతడు తీసుకోకుండా, ‘‘నీలాంటి వ్యక్తులను చూడడమే భాగ్యంగా భావిస్తాను. నువ్వు నాకు ముఖ్యమైన అతిథివి. మరెప్పుడైనా ఈ మార్గంలో వెళ్ళాల్సివస్తే, తప్పకవచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి,'' అంటూ సాగనంపాడు. చిన్నసామి సత్రం యజమానికి కృతజ్ఞతలు చెప్పుకుని, ‘‘ఇంకా నేనెందుకు ఊడ్చే పని చేయాలి. నాకు కావలసినవన్నీ ఈ మాయా శంఖం సమకూరుస్తుందికదా?'' అనుకుంటూ ఇంటికేసి అమితోత్సాహంతో నడవసాగాడు. భార్య తంగమ్మ భర్తను చూడగానే నవ్వుతూ, ‘‘కొండదేవుణ్ణి చూశావా?'' అంటూ దాహానికి నీళ్ళు తేవడానికి ఇంటి లోపలికి వెళ్ళింది. ‘‘నీ భర్త అంటే ఏమనుకున్నావు?'' అంటూ భార్య తెచ్చి ఇచ్చిన నీళ్ళు తాగి, తాను మాయా శంఖాన్ని సంపాదించిన విషయాన్ని గొప్పగా వివరించి, తలపాగా తువ్వాలులో ముడివేసి వుంచిన శంఖాన్ని తీసి చూపాడు. ‘‘ఆహా! ఇది నిజమా! శంఖాన్ని ముందు నేను ఊదుతాను,'' అంటూ తంగమ్మ పట్టరాని సంతోషంతో శంఖాన్ని తీసుకుని, ‘‘మాయా శంఖమా! నాకో బంగారు నాణెం కావాలి!'' అని చెప్పి దాన్ని ఊదింది. అయితే, ఎలాంటి శబ్దమూ రాలేదు. బంగారు నాణెమూ రాలేదు. ‘‘నేను ఊదితే పనిచేయడం లేదు. నువ్వు ప్రయత్నించు,'' అంటూ శంఖాన్ని భర్త చేతికి చ్చింది. చిన్నసామి దాన్ని గట్టిగా ఊదాడు. అయినా ఎలాంటి శబ్దమూ రాలేదు. అటూ ఇటూ తిప్పి ఊదడానికి ప్రయత్నించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. ‘‘రాత్రి ఊదితే శబ్దం వచ్చింది. పది వెండి కాసులు కావాలంటే ఇచ్చింది. వాటిని సత్రం యజమాని పుచ్చుకోలేదు. అవి నాదగ్గరే ఉన్నాయి చూడు,'' అంటూ వెండి కాసులను తీసి భార్యకు చూపాడు చిన్నసామి ఆశ్చర్యంతో. ‘‘నువ్వు ఊదిన శంఖం ఇదేనా అని జాగ్రత్తగా చూడు. బహుశా సత్రం యజమాని మాయా శంఖాన్ని దొంగిలించి, దాని స్థానంలో వేరొక దాన్ని పెట్టాడనుకుంటాను,'' అన్నది తంగమ్మ అనుమానంగా. చిన్నసామి శంఖాన్ని మరొక్కసారి పరిశీలనగా చూసి ‘‘అవును, నీ అనుమానం నిజమే అయివుంటుంది.గుహ దగ్గర నాకు లభించిన శంఖం వెండిలా తళతళా మెరుస్తూ కనిపించింది. ఇదేమో మాసిపోయివుంది,'' అన్నాడు. ‘‘రాజుగారు వచ్చేలోగా ఇప్పుడు పనిలోకి వెళ్ళు. సాయంకాలం సత్రానికి వెళ్ళి ఏమీ జరగనట్టు ఒక గది తీసుకో. భోజనం సమయంలో ఇప్పుడు నీ దగ్గరున్న శంఖాన్ని బంగారు నాణాలు ఇచ్చేలా కొండదేవుడు ఆశీర్వదించాడని సత్రం యజమానికి చెప్పు. ఆ తరవాత అతడేం చేస్తాడో చూడు,'' అని సలహా ఇచ్చింది భార్య. చిన్నసామి చీపురును అందుకుని ఆలయం వీధిని చిమ్మడానికి హడావుడిగా వెళ్ళాడు. ఆలయ దర్శనానికి రాజు ఆరోజు కొంత ఆలస్యంగా రావడంతో చిన్నసామి సంతోషించాడు. పని ముగించుకుని సత్రానికి బయలుదేరాడు. సత్రం యజమాని వాణ్ణి ఆశ్చర్యంతో చూశాడు. భోజనం చేస్తూ చిన్నసామి యథాలాపంగా తన వద్ద ఉన్న శంఖాన్ని గురించి ప్రస్తావించి, ‘‘ఈ శంఖాన్ని ఊదితే వెండి కాసులకు బదులు బంగారు నాణేలు రాలే విధంగా కొండదేవుడు ఆశీర్వదించాడు,'' అన్నాడు. ఆ తరవాత సత్రం యజమాని చూపంతా తన తలపాగా తువ్వాలులో ముడి వేసిన శంఖం మీదే ఉండడం చిన్నసామి గ్రహించాడు. భోజనం అయ్యాక, ‘‘బాగా అలిసి పోయాను. వెంటనే పడుకోవాలి!'' అన్నాడు చిన్నసామి ఆవులిస్తూ. వాడు పడుకున్నాడే కాని నిద్ర పోలేదు. నిద్ర పోతున్నట్టు నటించసాగాడు. సత్రం యజమాని అడుగులోఅడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చి, చిన్నసామి తువ్వాలులో దాచిన శంఖాన్ని తీసుకుని నిన్న వాడి నుంచి దొంగిలించిన శంఖాన్ని అందులో పెట్టి జాగ్రత్తగా ముడివేసి వెళ్ళిపోయాడు. మాయాశంఖాన్ని భద్రంగా దాచుకుని పడుకున్న చిన్నసామి, తెల్లవారక ముందే లేచి, సత్రం యజమానిని నిద్ర లేపి డబ్బు ఇవ్వబోయాడు. కాని అతడు పుచ్చుకోలేదు. చిన్నసామి ఉత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. ఇంటి పైకప్పు, వెండి, బంగారు కాసులు, అంగ రక్షకుడి ఉద్యోగం ఇలా మాయా శంఖం అడిగిన వన్నీ ఇవ్వడంతో చిన్నసామి, తంగమ్మ దంపతులు సుఖసంతోషాలతో జీవించసాగారు. అక్కడ సత్రం యజమాని బంగారు కాసులు వస్తాయన్న పేరాశతో వెండికాసులు ఇచ్చే శంఖాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను కదా అని తన్ను తాను తిట్టుకోసాగాడు. ‘‘ఇకరాడు.... వాడు మాయా శంఖం ఇకపై ఈ దరిదాపులకు రాడు," అంటూ వాపోసాగాడు. అయితే చిన్నసామి ఒకనాడు సత్రానికి వెళ్ళాడు. మామూలుగా కాదు; రాజోద్యోగిలా. ఎరట్రి ఉడుపులు ధరించి అందమైన నల్లటి గుర్రమెక్కి వెళ్ళాడు. సత్రం యజమాని వాణ్ణి చూసి రాజుగారి అంగరక్షకుడు అతిథిగా వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోయాడు. ‘‘ఇంతవరకు ఎన్ని బంగారు నాణాలు సేకరించావో తెలుసుకుందామని వచ్చాను,'' అన్నాడు చిన్నసామి గంభీరంగా. సత్రం యజమాని ఇప్పుడు వాడి కంఠస్వరం గుర్తించి భయంతో వణికిపోతూ చేతులు జోడించి, ‘‘బాబూ, తమరా? నన్ను క్షమించండి,'' అని వేడుకున్నాడు. చిన్నసామి చిన్నగా నవ్వి, సత్రం యజమాని కేసి చేయి ఊపుతూ గుర్రమెక్కి వెళ్ళిపోయాడు.